వెంకటాపురం(కె)/వాజేడు: భద్రాచలం నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. వెంకటాపురం(కె)మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని కమ్యూనిటీ హాల్లో సర్పంచ్ సరస్వతి అధ్యక్షతన గురువారం నిర్వహించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు. అనంతరం గ్రామసభలో పలు సమస్యలపై ఇచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. అలాగే వాజేడు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగారం గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభకు ఎమ్మెల్యే వెంకట్రావు హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో విద్యుత్ లైన్లను ఇప్పటికే వేస్తున్నారని విద్యుత్ సమస్య రాకుండా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో నాలుగు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా వాటి గృహ ప్రవేశ కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు


