ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
● డిజిటల్ విధానంలో నమోదు
● వివరాలు సేకరిస్తున్న వ్యవసాయ అధికారులు
● డీసీఎస్ యాప్లో మొబైల్ ద్వారా వివరాలు ఎంట్రీ
లక్నవరంలో పర్యాటకుల సందడి
గోవిందరావుపేట: మండల పరిధిలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు పరిసరాల్లో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో లక్నవరం జలాశయం కిటకిటలాడింది. మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో పర్యాటకులు సాయంత్రం వేళలో లక్నవరం చేరుకుని వేలాడే వంతెనలపై నడుస్తూ బోట్లలో షికారు చేశారు. ఈ సందర్భంగా సరస్సు అందాలను తిలకించి సెల్ఫీ, ఫొటోలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు.
గోవిందరావుపేట: జిల్లాలో ఇరవై రోజులుగా పంటల నమోదు(డిజిటల్ క్రాప్ సర్వే బుకింగ్) ప్రక్రియ పక్కాగా కొనసాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్ని ఎకరాల్లో ఏ రకమైన పంటలు సాగు చేశారు..దిగుబడిపై అంచనా వస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ వివరాలతో మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆహార ధాన్యాల లభ్యతపై ప్రభుత్వానికి స్పష్టత రానుంది.
1.70 లక్షల ఎకరాల్లో..
ములుగు జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. నర్సింహాసాగర్, పాలెం వాగు, గుండ్లవాగు, మల్లూరు ప్రాజెక్ట్లతో పాటు రామప్ప, లక్నవరం లాంటి చెరువులు ఉన్నాయి. దీంతో పాటు బోర్లు, బావుల కింద వివిధ రకాల పంటలను రైతులు సాగు చేశారు. సుమారుగా ఏటా వానాకాలం సీజన్లో 1.70 లక్షల ఎకరాల్లో, యాసంగిలో 85 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. వరి, మిరప, పత్తి వంటి పంటల సాగుతో పాటు వాణిజ్య పంటలపై స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు.
249 వలంటీర్ల నియామకం
జిల్లాలో 10 మండలాల పరిధిలో సుమారుగా 2 లక్షల ఎకరాలకు పైగా సర్వే సాగుతోంది. సర్వే చేసేందుకు నిరుద్యోగ యువతను వలంటీర్లుగా తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 249 మంది వలంటీర్లను నియమించగా 20 రోజుల క్రితం నుంచి సర్వే ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన డీసీఎస్ యాప్లో మొబైల్ ద్వారా వివరాలు పొందుపరుస్తున్నారు. ఈ యాప్ ఓపెన్ చేసిన వెంటనే కెడెస్టల్ మ్యాప్ డిస్ప్లే అవుతుంది. ఆ మ్యాప్లో 5 నుంచి 10 మంది రైతుల పేర్లు, వారి భూముల సర్వే నంబర్లు వస్తాయి. అక్షాంశం, రేఖాంశాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వలంటీర్లు ఖచ్చితంగా రైతును సెలెక్ట్ చేసుకుని సర్వే నంబర్ ఉన్న భూమి దగ్గరకు వెళ్తున్నారు. పొలాల దగ్గరకు వెళ్లి రైతు పేరు, ఆధార్ నంబర్తో పాటు ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారో నమోదు చేస్తున్నారు. అనంతరం దానిని ఏఈఓలు వెరిఫై చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 56 శాతం మేర సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లా ముందడుగులో ఉంది.
రైతులు సహకరించాలి..
జిల్లాలో పంటల సర్వే నమోదు వేగంగా జరుగుతోంది. ఏఈఓల పర్యవేక్షణలో ఈ సర్వేను వలంటీర్లు చేపడుతున్నారు. రైతుల నుంచి పలు వివరాలు సేకరించి యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు ఏఈఓలకు, వలంటీర్లకు తమ పొలాల వద్ద అందుబాటులో ఉండి వివరాలు అందించి సహకరించాలి.
– వి. సురేశ్కుమార్, డీఏఓ


