మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సందడి నెలకొంది.


