● అదనపు కలెక్టర్
మహేందర్జీ
ములుగు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్జీ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తగిన మౌలిక వసతులు కల్పించాలన్నారు. తేమ శాతం కొలిచే పరికరాలు, బరువు తూకం యంత్రాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలన్నారు. రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని ఓపీఎంఎస్ ద్వారా వెంటనే నమోదు చేసి, ఆలస్యం లేకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, షెడ్లు, విశ్రాంతి తీసుకునేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. ముందస్తు చర్యలలో భాగంగా అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని టార్ఫాలిన్లు, ఇతర మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ కృష్ణవేణి, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి పైసల్ హుస్సేని, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
‘విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలి’
ములుగు రూరల్: విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని డిగ్రీ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ బాలయ్య అన్నారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–2 ఆధ్వర్యంలో జాకారంలోని ప్రభుత్వ పాఠశాలలో శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ దాసరి సమత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు యూనిఫాం లేని సైనికులని తెలిపారు. ఈ శిబిరాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సహనశీలత, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయన్నారు. ఈ శిబిరం నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ –ప్లాస్టిక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కోసం పాటుపడాలని సూచించారు. అనంతరం విద్యార్థులు జాకారం పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అనిల్కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
‘క్యాంపు కార్యాలయంపై
దాడి సరికాదు’
ఏటూరునాగారం: గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఇంటి పెద్దపై దాడి, ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అన్నారు. అధికారం అండతో అరాచకాలు చేస్తే ప్రజలు క్షమించరని వివరించారు. అభివృద్ధిని చూపించి ప్రజల మనస్సు గెలవాల్సింది పోయి, భౌతిక దాడులతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు.


