ములుగు రూరల్: రేపు(సోమవారం) జిల్లా స్థాయి జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బండారుపల్లి గురుకుల పాఠశాలలో సోమవారం 20 ఏళ్లలోపు బాలబాలికలకు, 20 ఏళ్లు పైబడిన పురుషులకు, మహిళలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు గురుకుల పాఠశాల పీఈటీ రాజ్కుమార్కు రిపోర్టు చేయాలని సూచించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు ఈ నెల 11, 12వ తేదీలలో హనుమకొండ జవహర్లాల్ స్టేడియంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ కప్ పోటీలలో పాల్గొంటారని వివరించారు.
రన్ ఫర్ జీసస్ ర్యాలీ
ములుగు: జిల్లా కేంద్రంలో శనివారం రన్ ఫర్ జీసస్ ర్యాలీని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతీయ రహదారిపై సాధన స్కూల్ నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్ మీర్జా, 8వ వార్డు కౌన్సిలర్ నల్లెల్ల స్వాతి భరత్ కుమార్లు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏసుప్రభు గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ రోని ఒనెసిమస్, జిల్లా అధ్యక్షుడు రెవ క్రీస్తుదాసు, వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ జోనాత్తాన్, బిషప్ సామ్యూల్, పాస్టర్ రమేశ్, సుదర్శన్ రావు, బొచ్చు సమ్మయ్య, కుమార్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యువన్కు పరామర్శ
ములుగు: మేడారం గద్దెల వద్ద గాయపడిన పూజారి కుమారుడు యువన్ హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శనివారం తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ములుగు మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బాలుడికి ప్రమాదం జరిగిందన్నారు. బాలుడికి అయ్యే వైద్యఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బాలుడి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం చెల్లించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎట్టి జగదీశ్, రామసహాయం శ్రీనివాస్రెడ్డి, ఈసం రాంమూర్తి, రామయ్య, ప్రశాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రామప్ప శిల్పకళ బాగుంది
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ బాగుందని పీసీసీఎఫ్– చీఫ్ వైల్డ్లైఫ్ అధికారి వినయ్కుమార్ అన్నారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆయన శనివారం సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ శాలువాతో సత్కరించారు. ఆలయ చరిత్రను టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. వారి వెంట కాళేశ్వరం సీపీఎఫ్ ప్రబాకర్, ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్డీఓ సత్తయ్య, ఎఫ్ఆర్ఓ శంకర్, డీఆర్ఓ మధు బాబు, ఎఫ్బీవో కిషన్ తదితరులు ఉన్నారు.
రామప్పలో మఠాధిపతి నాగమహర్షి,
కెనడాకు చెందిన హరిదాస్
రామప్ప దేవాలయాన్ని శ్రీ మహాకాళేశ్వర దేవస్థానం నాగమఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ కాలనాగ మహర్షి, కెనడా దేశానికి చెందిన హరిదాస్తో కలిసి శనివారం రామప్పను సందర్శించారు. భూపాలపల్లి జిల్లా నందిగామ మహాకాళేశ్వర దేవస్థానానికి హరిదాస్ రాగా మఠాధిపతి అయిన నాగమహర్షి హరిదాస్ను తీసుకుని రామప్ప ఆలయానికి వచ్చి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప ఆలయం బాగుందని వారు కొనియాడారు.


