న్యూస్రీల్
ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
మంగపేట: మండల పరిధిలో జిల్లా సరిహద్దు గ్రామమైన బ్రాహ్మణపల్లి వద్ద నిర్మించిన శివగంగ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారింది. కోట్లాది రూపాయల నిధులు గంగపాలేనా అని ఆయా గ్రామాల ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్రాహ్మణపల్లికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని కత్తిగూడెం గ్రామ సమీపంలో గల గోదావరి ఒడ్డున లిఫ్ట్ ఇరిగేషన్ను ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్తో బ్రాహ్మణపల్లి, కత్తిగూడెం రెవెన్యూ పరిధిలోని 1600 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీటిని అందించే లక్ష్యంతో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.8.52 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎత్తిపోతల పథకం పనులను అప్పటి భారీనీటి పారుదలశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నవంబర్ 25న ప్రారంభించారు.
నాసిరకంగా పనులు
ఎత్తిపోతల పథకం పనులపై సంబంధిత ఏపీఎస్ఐడీసీ అధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో టెండర్ ద్వారా పనులు పొందిన గుత్తేదారు నాసిరకంగా పనులు చేపట్టి చేతులు దులుపుకోవడంతో 18ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత టీఎస్ఐడీసీ అధికారులు మాత్రం పనులు మొత్తం పూర్తయ్యాయని నీటిని లిఫ్టింగ్ చేసేందుకు గోదావరిలో వరదనీరు ఒడ్డు వెంట కాకుండా మఽ ద్య నుంచి ప్రవహిస్తుండడంతో ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారిందని చెబుతున్నారు.
చిరకాల వాంఛ తీరేనా?
ఎత్తిపోతల పథకం పూర్తయితే తమ భూములకు రెండు పంటలకు సాగునీరు అందుతుందనుకున్న బ్రాహ్మణపల్లి, కత్తిగూడెం గ్రామాల ఆయకట్టు రైతుల చిరకాల వాంఛ కలగానే మిగిలేనా అనే సందేహం నెలకొంది. ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు వినియోగంలోకి రాకపోవడంపై ఆయకట్లు రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకొస్తే బ్రాహ్మణపల్లి, పెరకకుంట, కిందిగుంపు, కత్తిగూడెం గ్రామాల రైతులకు సాగుభూములకు అధికారికంగా 1600 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. అనాధికారికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి, రెడ్డిగూడెం గ్రామాలకు చెందిన రైతులకు చెందిన వేలాది ఎకరాల సాగు భూములకు రెండు పంటలకు సరిపడా సాగునీరు అందే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
నిరుపయోగంగా మారిన బ్రాహ్మణపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం
18 ఏళ్లు గడుస్తున్నా అందని సాగునీరు
అధికారుల పర్యవేక్షణ లోపంతో
రైతుల ఇక్కట్లు


