వెంకటాపురం(కె): మెడికల్ షాపుల యజమానులు ఔషధ నియంత్రణ శాఖ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని భూపాలపల్లి జిల్లా ఔషధ నియంత్రణ అధికారి పావని అన్నారు. ఈ మేరకు మంగళవారం వెంకటాపురం(కె) మండల కేంద్రంలో మెడికల్ షాపులను తనిఖీ చేశారు. గతంలో తనిఖీల్లో నిబంధనలు అతిక్రమించిన యజమానులకు సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేసి షాపులను మూసివేయించారు. ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ద్వారా నోటీసులు జారీ చేసినప్పటికీ సమాధానం ఇవ్వకపోవడంతో ఐదు రోజుల పాటు లైసెన్స్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. యజమానులు నింబధనలు తప్పని సరిగా పాటించాలని ఆమె సూచించారు.
పెట్రోల్ బంక్ల మూసివేత
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని రెండు బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో యజమానులు మంగళవారం మూసివేశారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, కార్లు, అటోలకు పెట్రోల్ దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలువురు బ్లాక్ మార్కెట్లో అధిక ధర చెల్లించి పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేసిన పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
నాయీబ్రాహ్మణులు
సంఘటితం కావాలి
ములుగు రూరల్: నాయీబ్రాహ్మణులు హక్కుల సాధనకు సంఘటితం కావాలని సంఘం గౌరవ అధ్యక్షుడు జంపాల రవీందర్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలన్నారు. దేవాలయాలు, జాతరలో హక్కుల కోసం పోరాడాలని సూచించారు. వృత్తిదారులపై కార్పొరేట్ శక్తుల దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ములుగు మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శరబందం, ఉపాధ్యక్షుడిగా ముత్యాల రాజు, ప్రధాన కార్యదర్శిగా విష్ణు, కోశాధికారి సాంబయ్య, సహాయ కార్యదర్శిగా నరేందర్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
రోడ్డును నాణ్యతగా
నిర్మించాలి
ఏటూరునాగారం: మండల కేంద్రంలో కరకట్ట నుంచి ముక్కెరల లాలయ్య ఇంటి వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డును నాణ్యతగా నిర్మించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డీఈఈ నరేశ్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రలంలోని సీసీ రోడ్డు నిర్మాణం పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏఈ నిఖిత్తో కలిసి పరిశీలించారు. మంత్రి సీతక్క చొరవతో రూ. 2.5కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం పనులు మంజూరైనట్లు తెలిపారు. సీసీ రోడ్డు పనులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రదాన కార్యదర్శి గుడ్ల దేవేందర్, అదికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, వల్స తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


