ములుగు రూరల్: ప్రభుత్వం విద్యారంగానికి 20శాతం నిధులు కేటాయించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉప్పస్వామి అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ టీఎస్.దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 8 శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేస్తూ టైమ్ స్కేల్ కల్పించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు హట్కర్ సమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు, ఏటూరునాగారం జోన్ సెక్రటరీ రాందేవ్, ఉపాధ్యాయ దర్శిని సంపాదక వర్గం సభ్యులు దిలీప్, రాజు, సారంగపాణి, శ్యాం సుందర్ తదితరులు పాల్గొన్నారు.


