మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
వెంకటాపురం(ఎం): మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. మండల పరిధిలోని లక్ష్మిదేవిపేట పరిధిలోగల మారేడుగొండ చెరువులో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ స్పెషల్ ఆఫీసర్ హనుమంతరావుతో కలిసి చెరువులో చేప పిల్లలను గురువారం వదిలారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని 478 సీజనల్ చెరువులు, 2 రిజర్వాయర్లు, 8 పెరినియల్ చెరువుల్లో 2025–26 సంవత్సరానికి గాను 1,57,55,224 చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. చేప పిల్లల పంపిణీతో చేపల ఉత్పత్తి, దిగుబడులు పెరిగి మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందన్నారు. మత్య్సకారులు స్వేచ్ఛగా చేపలను అమ్ముకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు తాజా చేపలతో పాటు అందుబాటు ధరలలో లభ్యమవుతాయని వివరించారు. అంతే కాకుండా జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు సైతం చేపలను ఎగుమతులు చేయవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు సాదు రఘు, జిల్లా మత్స్యశాఖ అధికారి సల్మాన్ రాజు, లక్ష్మీదేవిపేట సొసైటీ అధ్యక్షుడు సాదు శంకర్, ఫిషరీస్ టెక్నికల్ ఆఫీసర్ రమేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
చేపపిల్లల విడుదల అనంతరం కలెక్టర్ లక్ష్మీదేవిపేటలోని వెన్నెల గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 184 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 31 మంది రైతుల నుంచి 175,160 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేశామన్నారు. సన్న ధాన్యానికి ప్రభుత్వం ప్రతీ క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉంటే రైతులు టోల్ ప్రీ నంబర్ 9347416178కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, తహసీల్దార్ గిరిబాబు, ఏపీఎం ధర్మేందర్, సీసీ ఐలయ్య పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


