
మహాజాతరకు.. 112 రోజులే..
వనదేవతల ప్రాంగణ విస్తరణ పనులకు కసరత్తు
పనుల డిజైన్ మ్యాప్ చూపిస్తూ కలెక్టర్కు వివరాలను తెలుపుతున్న అధికారులు
● సమీపిస్తున్న జాతర సమయం
● పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు ఇంకా 112 రోజులే సమయం మిగిలి ఉంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు మహాజాతర జరగనుంది. ఈ సారి జాతరకు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలతో వనదేవతల గద్దెల ప్రాంగణం విస్తరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పనుల్లో నిమగ్నమైంది. సీఎం రేవంత్రెడ్డి మేడారంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆలయ ప్రాంగణ సాలహారం (ప్రహరీ) నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు.
వంద రోజులే లక్ష్యంగా..
మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు జిల్లా అఽధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ఆలయ గద్దెల చుట్టూ సాలహార నిర్మాణ పనులను మాస్టర్ ప్లాన్ డిజైన్ ప్రకారం రాతితో నిర్మించేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మేడారం జాతరకు 112 రోజుల సమయం మాత్రమే ఉంది. వంద రోజుల్లో అమ్మవార్ల ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో జిల్లా అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేలాది మంది కార్మికులను ఏర్పాటు చేసి రాత్రి, పగలు పనులు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గద్దెల ప్రాంగణ విస్తీర్ణ పనులపై మంత్రి సీతక్క ఎప్పటికప్పడు జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేసేందుకు సన్నద్ధమైంది.