
మేడారానికి జాతీయ హోదా కల్పిస్తాం
ములుగు: మేడారం మహా జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే కేంద్రం జాతీయ హోదా కల్పించేలా తన వంతు కృషి చేస్తానని మహబుబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ తెలిపారు. ములుగు రామాలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత అన్నదాన కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే తను ఎంపీగా ఉండి ఆరు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని వెల్లడించారు. ఇప్పుడు మేడారం జాతీయ హోదా కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న జాతర వరకు జాతీయ హోదా కల్పించేలా చర్యలు చేపడతానని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, నాయకులు నగరపు రమేశ్, కొత్త సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్