
మహిళ ఆరోగ్యం..
జిల్లాలో మహిళల కోసం నాలుగు ఆరోగ్య క్లినిక్లు
ఇంటికి సౌభాగ్యం
వెంకటాపురం(ఎం):
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. మహిళల కోసం ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళ క్లినిక్లను ప్రారంభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంత పేద మహిళలకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళా క్లినిక్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలో 2023 మార్చి 8న గత ప్రభుత్వం ఆరోగ్య మహిళా క్లినిక్ సెంటర్లను ప్రారంభించి మహిళలకు వైద్య సేవలు అందిస్తుంది. జిల్లాలోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు ప్రతీ మంగళవారం వైద్యాధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు.
33,788 మంది మహిళలకు పరీక్షలు
జిల్లాలోని వెంకటాపురం(ఎం), మంగపేట, రొయ్యూరు, ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య క్లినిక్ల ద్వారా ఇప్పటి వరకు 33,788 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఇందులో అనుమానిత లక్షణాలు ఉన్న 287 మందిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఇందులో నోటి, రొమ్ము, గర్భసంచి క్యాన్సర్ లక్షణాలు, థైరాయిడ్, కడుపులో నీటి బుడగలు లాంటివి ఉన్న వారిని జిల్లా ఆస్పత్రితో పాటు వరంగల్ ఎంజీఎం, హైదారాబాద్లోని ఎంఎన్జే ఆస్పత్రికి సిఫారసు చేస్తున్నారు.
● పీహెచ్సీల్లో ప్రతీ మంగళవారం పరీక్షలు
● ఇప్పటి వరకు 33,788 మందికి పరీక్షలు
● 18 మందికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తింపు
ప్రాథమిక దశలోనే గుర్తింపు
ప్రతీ మంగళవారం మహిళా క్లినిక్ల ద్వారా వైద్య సిబ్బంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతీ మహిళకు ప్రాథమిక పరీక్షలు జరిపి వ్యాధిని నిర్ధారించడం, అనుమానితులను జిల్లా ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు. వ్యాధి గుర్తిస్తే ఉచితంగా వైద్య చికిత్సలు చేసి మందులు అందజేస్తున్నారు. మహిళలు ఆరోగ్య సమస్యలతో పాటు పలు రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. జిల్లాలో 18 మంది వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వ్యాధి తీవ్రమైన తర్వాత చికిత్స తీసుకోవడం కన్నా ప్రాథమిక దశలోనే పరీక్షల ద్వారా వ్యాధి లక్షణాలు గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా నయం చేయవచ్చని వైద్యాధికారులు మహిళలకు సూచిస్తున్నారు.
మహిళలు తప్పకుండా పరీక్షలు చేసుకోవాలి
మహిళలు ఏమైనా అనుమానిత లక్షణాలు ఉంటే సంబంధిత వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా పూర్తిగా వ్యాధిని నయం చేయవచ్చు.18 ఏళ్లలోపు ఆడపిల్లలకు థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటున్నందున తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్య మహిళా క్లినిక్ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. మహిళలు, యువతులు మంచి పోషకాహారం తీసుకోవాలి.
– చీర్ల శ్రీకాంత్, మాతా శిశుపోషక జిల్లా అధికారి
●

మహిళ ఆరోగ్యం..

మహిళ ఆరోగ్యం..