గోవిందరావుపేట: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం పోచమ్మ తల్లికి బోనాలతో తరలివెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నుంచే బోనం తయారుచేసుకున్న మహిళలు ఆలయానికి తరలివెళ్లి అమ్మవారికి నైవేధ్యాన్ని సమర్పించారు. భక్తులంతా పోచమ్మ తల్లిని వర్షాలు బాగా కురిసి పంటలు పండాలని మొక్కుకున్నారు.
ప్రతిఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలి
కన్నాయిగూడెం: గ్రామంలోని ప్రతిఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని ఆర్బీఐ డీజీఎం జగదీశ్ అన్నారు. మండల కేంద్రంలో ఎస్ఎస్తాడ్వాయి సీఎఫ్ఎల్ ఆధ్వర్యంలో పీఎంజేజేబీవై పథకంపై బుధవారం క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. 18 నుంచి 70 ఏళ్లు ఉన్న ప్రతిఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండడంతో పాటుగా ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన కింద సంవత్సరానికి రూ.20 కట్టుకోవాలన్నారు. 50ఏళ్ల లోపు వారు రూ.436 బ్యాంకు ఖాతాల్లో కట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఏపీఎం రెడ్డి, సీసీ సుదీష్ణ, టీజీఐపీపిల్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీని తనిఖీ చేసిన డీఈఓ
ములుగు రూరల్: ములుగు పరిధిలోని మాధవరావుపల్లి కేజీబీవీని డీఈఓ చంద్రకళ బుధవారం తనిఖీ చేశారు. వంట గది, స్టోర్ రూమ్లను తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న భోజనం, మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులను సందర్శించి, విద్యార్థులకు బోధించడంతో పాటు పాఠ్యాంశాలపై వారికి ఉన్న మేధాశక్తిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ జీవనప్రియ, ఉపాధ్యాయులు ఉన్నారు.
ముస్లిం రిజర్వేషన్ల అమలుకు కుట్ర
ములుగు రూరల్: కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలకు సైతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద కుట్ర పూరితంగా ధర్నా చేపట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆరోపించారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 10 శాతం ముస్లింలకు కేటాయించాలని ప్రయత్నం చేస్తుందన్నారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, సురేందర్, స్వరూప, జవహర్ లాల్, రవీంద్రాచారి, వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోచమ్మ బోనాలు