
తమిళ నటుడు విజయ్ ఆంటోని ‘‘భద్రకాళి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రీసెంట్గా మార్గాన్ సినిమాతో మెప్పించిన ఆయన మరోసారి సత్తా చాటేందుకు బలమైన కథతో రానున్నారు. ‘అరువి’ ఫేమ్ అరుణ్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా, తృప్తి రవీంద్ర, రియా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భద్రకాళి’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది. తెలుగులో సురేశ్బాబు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో పలు విషయాలను విజయ్ ఆంటోని పంచుకున్నారు.
25వ సినిమాగా భ్రదకాళి రానుంది. నంబర్ మాత్రమే మారింది. కానీ, నేను ప్రతి సినిమాకు ఒకే విధంగా పనిచేశాను. అయితే, ఈ సినిమాకు నిర్మాతకు నా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో నిర్మించాను. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. ఒక నిర్మాతగా ఈ మూవీ కోసం చాలా ఇబ్బందులు పడ్డాను. నా వెనకాల ఎవ్వరూ లేరు. ప్రతి రూపాయి నేను మాత్రమే ఖర్చు పెట్టాలి. సుమారు 15 నెలల పాటు ఎంతగానో శ్రమించాను. సినిమా విడుదలకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, వడ్డీలు వంటి విషయాలను చూసుకునే క్రమంలో కొన్ని ఒత్తిళ్లు వచ్చాయి.
కానీ, వాటిని అధిగమించి సినిమా కోసం పనిచేశాను. అయితే నిర్మాత సురేశ్బాబుతో మంచి స్నేహం ఉంది. మార్గన్ మూవీని తెలుగులో ఆయనే విడుదల చేశారు. మరోసారి వారితో కలిసి ప్రయాణం చేస్తున్నాను. సుమారు 300కు పైగా థియేటర్స్లో భద్రకాళి విడుదల చేస్తున్నారు. అని ఆయన అన్నారు.