'థియేటర్లు ఇవ్వ‌లేదు.. చిన్న సినిమాలను చంపేస్తున్నారు' | Tollywood Movie Team Allegations On Cinema Industry | Sakshi
Sakshi News home page

Tollywood: ' చిన్న సినిమాలను ఆ నలుగురే చంపేస్తున్నారు'

May 6 2026 3:38 PM | Updated on May 6 2026 3:45 PM

Tollywood Movie Team Allegations On Cinema Industry

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై నటుడు, నిర్మాత  షెరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమా రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదని తీవ్ర ఆరోపిణలు చేశారు. మంచి సినిమాలను కిల్ చేస్తున్నారని.. చిన్న సినిమాలను నలుగురు రాక్షసులు చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

నైజాం ఏరియాలో ఓ అందాల రాక్షసి సినిమాకు ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదని మెహదీ ఆరోపించారు. ఈ విషయంపై లీగల్‌గా పోరాటం ప్రారంభించామని.. ఇండస్ట్రీ పెద్దలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చామని షెరాజ్ మెహదీ  వెల్లడించారు.   చిన్న సినిమాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి మన ఇండస్ట్రీలో ఉందని.. బాలీవుడ్‌లో కూడా ఇలా ఉండదని వ్యాఖ్యానించారు. సెన్సార్ బోర్డు నిబంధనలు చిన్న సినిమాలకు భారంగా మారుతున్నాయని.. ఏడీసీసీ వంటి చార్జీలు కూడా నిర్మాతలను కుంగదీస్తున్నాయని తెలిపారు.

‘చిన్న సినిమాలే వేలాది మందికి ఉపాధి’..

ప్రొడ్యూసర్, నటుడు లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ… 'ఇండస్ట్రీలో పెద్దల ధోరణి చిన్న సినిమాల పాలిట శాపంగా మారింది. చిన్న నిర్మాతలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. త్వరలో నిరాహార దీక్షలు చేస్తాం. ఈ మాఫియాపై ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తాం” అని హెచ్చరించారు. చిన్న సినిమాలే వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని.. వాటినే తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మీడియా సపోర్ట్ అవసరం..

నటి మధు మాట్లాడుతూ… 'నేను ఢిల్లీ నుంచి వచ్చాను. టాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయి. కానీ చిన్న సినిమాలకు మీడియా సపోర్ట్ చాలా అవసరం, చిన్న సినిమాల‌ను బ‌తికిస్తేనే మా లాంటి న‌టీన‌టుల‌కు అవ‌కాశాలు వ‌స్తాయి” అని అన్నారు.

డిస్ట్రిబ్యూషన్ సిండికేట్లు దెబ్బ..

నటుడు, మూవీ మూవీ మేక‌ర్ కాళీ చరణ్ మాట్లాడుతూ.. 'చిన్న సినిమాల విడుదలకు డిస్ట్రిబ్యూషన్ సిండికేట్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సెన్సార్ నిబంధనలు కూడా ఆర్థిక భారంగా మారాయి. అనేక మంది చిన్న‌ నిర్మాతలు తనలాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నటుడు, నిర్మాత ఉప్పు రమేష్ మాట్లాడుతూ… “వీడే మన వారసుడు అనే మా సినిమాను అవార్డులకు అప్లై చేశాం. 25 వేల రూపాయ‌ల ఫీజు కూడా చెల్లించాం. కానీ, క‌నీసం అవార్డు ఫంక్షన్‌కు కూడా ఆహ్వానం లేదు. ప్రభుత్వం, ఇండస్ట్రీ రెండూ చిన్న సినిమాలను తొక్కెస్తున్నాయి” అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మొత్తానికి, చిన్న సినిమాలకు థియేటర్లు, సరైన అవకాశాలు కల్పించకపోతే కొత్త ప్రతిభ ఎదగడం కష్టమవుతుందని చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేసింది. చిన్న సినిమాలను కాపాడాలని, పరిశ్రమలో సమాన అవకాశాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని, ఇండస్ట్రీ పెద్దలను కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement