సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ బుల్లితెర నటి సుభాషిణి బాలసుబ్రమణ్యం బలవన్మరణానికి పాల్పడింది. తన భర్తతో వీడియో కాల్ మాట్లాడిన నటి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో కోలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. కుటుంబ కలహాల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ సంఘటనపైగు సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు ఆమె మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సహనటులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తమిళంలో ప్రముఖ సీరియల్ కాయల్లో తన పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. 2012లో 'ఇని అవన్' అనే చిత్రంతో ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అంతేకాకుండా షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించారు. శ్రీలంక మూలాలు కలిగిన నటి చెన్నైలోని అయ్యప్పంతంగల్లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. తన పుట్టినరోజుకు కేవలం కొన్ని రోజుల ముందుగానే ఆమె మరణించడంతో అభిమానులు షాకవుతున్నారు. ఏప్రిల్ 12న ఆమె తన పుట్టినరోజును జరుపుకోవాల్సి ఉంది. ఇదే నెలలో ఏప్రిల్ 21న ఆమె వివాహ రెండవ వార్షికోత్సవం కూడా రాబోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సుభాషిణికి ఇన్స్టాగ్రామ్లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.


