ప్రముఖ నటులు జగపతి బాబు హోస్ట్గా చేస్తున్న టాక్ షోలో తాజాగా నటి రమ్యకృష్ణ(Ramya Krishnan) పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె తన స్నేహితురాలు, దివంగత నటి సౌందర్య(Soundarya)ను గుర్తు చేసుకున్నారు. తనతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిద్దరూ కలిసి గతంలో అమ్మోరు, నరసింహ, హలో బ్రదర్ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలలో పనిచేశారు. ఆ షో మొత్తం చాలా ఎనర్జీగా కనిపించిన రమ్యకృష్ణను సౌందర్య గురించి చెప్పాలని జగపతి బాబు అడిగిన క్షణం నుంచి రమ్య కాస్త బాధగానే కనిపించారు.
సౌందర్య, రమ్యకృష్ణ ఇద్దరూ కలిసి నటించిన నరసింహ సినిమా నుంచి కొన్ని సీన్స్ను జగపతి బాబు చూపించారు. స్క్రీన్ మీద వీడియో రన్ అయ్యేంత వరకు రమ్య కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సౌందర్యతో తన జ్ఞాపకాలను రమ్యకృష్ణ ఇలా పంచుకున్నారు. ' 1995లో అమ్మోరు షూటింగ్ సమయంలోనే సౌందర్యను మొదటిసారి చూశాను. అప్పుడే ఆమె గురించి తెలుసుకున్నాను. చిన్న తనం నుంచే తనను తాను తీర్చిదిద్దుకుంటూ ఎదిగింది. ఆమెకు ఎంత పేరు ప్రతిష్ట వచ్చినా సరే.. ఎవరినీ తక్కువగా చేసి మాట్లాడదు. ఆమె ఒక అద్భుతమైన వ్యక్తిగానే కాకుండా మాకు మంచి స్నేహితురాలిగా అనుబంధం ఉంది. ఆమెను ఎవరూ కూడా రీప్లేస్ చేయలేరు.' అని రమ్యకృష్ణ తెలిపారు. ఈ క్రమంలో ఆమె కంట కన్నీళ్లు మాత్రం ఆగలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు
నరసింహ సినిమా విడుదల సమయానికి రమ్యకృష్ణకు సమానంగా సౌందర్యకు పాపులారిటీ ఉంది. ఈ మూవీ వరకు కేవలం నటిగా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణకు ‘నరసింహ’ సినిమాతో తన స్టార్డమ్ మరింత పెరిగింది. ఈ చిత్రంలో రజనీకాంత్కు విలన్గా నీలాంబరి పాత్రలో ఆమె కనబర్చిన నటనకు చాలామంది ఫిదా అయ్యారు. అయితే, ఇదే మూవీలో తాను సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిపడ్డానని కూడా ఆమె చెప్పారు. కానీ, ఆ సీన్ చేసేందుకు సౌందర్య ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమని రమ్య గుర్తు చేసుకుంది. 2004 ఏప్రిల్ 17న సౌందర్య తన సోదరుడు అమర్నాథ్తో కలిసి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.
దేవుళ్లందరినీ తలుచుకున్నాకే ఆ సీన్ చేశా
రమ్యకృష్ణ మాట్లాడుతూ..' ఆ చిత్రంలో నా రోల్ సౌందర్యపై పగ తీర్చుకోవడం. అందుకే అలాంటి అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ మొదట ఆ సీన్ చేయలేకపోయా. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. చివరికి ఆ షాట్ నాకు ఇష్టం లేదు. సినిమా తప్పకుండా చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చేసేటప్పుడు దేవుళ్లందరినీ మనసులో స్మరించుకున్నా. ఆ తర్వాతే సౌందర్యపై చెంపపై కాలు పెట్టా. ఆ సీన్లో నటించిన కొన్ని రోజుల తర్వాత అదే మూడ్లో ఉన్నా.' అని చెప్పుకొచ్చింది.


