రామ్ చరణ్ కొత్త సినిమా 'పెద్ది' విడుదల తేదీపై ప్రస్తుతం గందరగోళం నెలకొంది. లెక్క ప్రకారం మార్చి 27న రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే ఈ తేదీన కూడా రావట్లేదని చెప్పి కొన్నిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది. రీసెంట్గా మరో మూవీ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ కూడా జూన్ 26న 'పెద్ది' వస్తుందనేసరికి అభిమానులు కంగారుపడ్డారు. తర్వాత తనకు తెలియకుండానే చెప్పేశానని క్లారిటీ ఇచ్చినప్పటికీ అందరికీ విడుదల తేదీపై సందేహం అలానే ఉండిపోయింది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్బాస్ ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా)
సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ అన్నింటికీ ఇప్పుడు స్వయంగా రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేశారు. మెగా డాటర్ నిహారిక నిర్మించిన 'రాకాస' ప్రమోషన్ల సందర్భంగా టీమ్ అంతా వెళ్లి చరణ్ని కలిశారు. మాటల మధ్యలో 'పెద్ది' లేట్ అవ్వట్లేదని కొంచెం ప్రమోట్ చెయ్యండ్రా అని ఫన్నీగా చెబుతూనే క్లారిటీ ఇచ్చేశారు. చెప్పిన తేదీకి రావడం పక్కా అనే స్పష్టత వచ్చేసింది.
విడుదలకు మరో నెల కూడా లేదు. అయినా ఇప్పటికీ షూటింగ్ జరుగుతోంది. ఒకటి రెండు పాటలు పెండింగ్లో ఉన్నాయని టాక్. మరి షూటింగ్ పూర్తి చేసి, పాన్ ఇండియా మూవీ కాబట్టి అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేసుకోవడానికి టైమ్ ఉంటుందా? లేదంటే చివరి నిమిషంలో మళ్లీ వాయిదా అని చెప్పి ఏమైనా షాకిస్తారా అనేది చూడాలి?
స్పోర్ట్స్ డ్రామాగా తీస్తున్న 'పెద్ది'లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా.. రిలీజ్ చేసిన రెండు పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బుచ్చిబాబు దర్శకుడు.
(ఇదీ చదవండి: 'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు: గుణశేఖర్)


