రజనీకాంత్‌ ఒడిలో బాలుడు.. ఏడేళ్ల నాటి స్టోరీ ఇప్పుడు వైరల్‌ | Rajinikanth And Mohammad Yaseen Behind Photo Story | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ ఒడిలో బాలుడు.. ఏడేళ్ల నాటి స్టోరీ, అతను ఇప్పుడేం చేస్తున్నాడు..?

Jun 2 2025 9:15 PM | Updated on Jun 2 2025 9:25 PM

Rajinikanth And Mohammad Yaseen Behind Photo Story

సోషల్‌మీడియాలో కొద్దిరోజులుగా ఒక ఫోటో వైరల్‌ అవుతుంది. రజనీకాంత్‌ ఒడిలో ఒక బాలుడు కూర్చొని ఉన్న ఫోటో గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే, అది ఎంతవరకు నిజం అని చాలామంది తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటో వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం.

ఈ ఫోటో 2018 నాటిది.  రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఆ బాలుడి పేరు మహమ్మద్ యాసిన్. ఏడేళ్ల వయసులో ఆ బాలుడు చేసిన పనితో తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. ఈరోడ్‌లో ఉన్న తన పాఠశాల సమీపంలో యాసిన్‌కు రూ. 50 వేలు  దొరికింది. ఇంటి నుంచి తన పాఠశాలకు వెళ్తున్నప్పుడు  రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక పర్సును చూశాడు. ఆ పర్సులో రూ.100, రూ.500 నోట్లు మొత్తం రూ.50,000 ఉన్నాయి. అప్పుడు ఆ బాలుడు నేరుగా తన స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సాయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ డబ్బును పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) 'శక్తి'కి ఇచ్చాడు. అప్పుడు ఆ పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదు, మీ ప్రిన్సిపాల్‌కు చెప్పకుండా నువ్వే తీసుకోవచ్చు కదా అని అడిగారు.  

దానికి యాసిన్ తిరిగి ఇలా సమాధానం ఇచ్చాడు. 'ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించి ఉంటారు. ఈ డబ్బు నాది కాదు. అలాంటప్పుడు దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలను. ఈ డబ్బు ఎవరిదో వారికే ఇవ్వండి' అంటూ తిరిగి బదులిచ్చాడు. బాలుడి నిజాయితీని మెచ్చిన ఏస్పీ నీకు  ఏదైనా కోరిక ఉంటే చెప్పు చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడు వెంటనే ఆ బాలుడు నాకు  సూపర్ స్టార్ రజనీకాంత్‌( Rajinikanth) అంటే చాలా ఇష్టం. ఆయన్ను కలవాలనే కోరిక ఉందని చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులు జరిగిన విషయాన్ని రజనీకాంత్‌కు తెలిపారు. 

అందుకు స్పందించిన రజనీ..  యాసిన్‌తో పాటు  తన కుటుంబ సభ్యులను కూడా తీసుకు రమ్మని తెలిపారు.  రజనీకాంత్ ఆ పిల్లవాడి నిజాయితీని ప్రశంసించి, అతని చదువుకు స్పాన్సర్ చేస్తానని ప్రకటించారు. ఆపై యాసిన్, అతని కుటుంబాన్ని పోయెస్ గార్డెన్‌లోని తన నివాసానికి ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేశారు. బాలుడికి సరైన దుస్తులు, కావాల్సిన బుక్స్‌ వంటివి తీసుకోవాలని అతని తల్లిదండ్రులకు రూ. 50వేలు రజనీ ఇచ్చారు. ఆపై యూసిన్‌ చదువులకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని రజనీ మాట ఇచ్చారు. 'రూ.100 నోటు కోసం కూడా మోసం, దొంగతనం, హత్య చేసే ఈ కాలంలో, అతను (యాసిన్) ఇది నా డబ్బు కాదని చెప్పి దానిని అప్పగించాడు. నిజంగా ఎంత నిజాయితీ. ఇది గొప్ప గుణం' అంటూ యాసిన్‌ను రజనీకాంత్ మెచ్చుకున్నారు.  ఆ బాలుడు ఈ ఏడాది 10వ తరగతి చదువుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement