బలమైన పాత్రల్లో తన సత్తా చాటే నటి కీర్తిసురేశ్. మహానటి చిత్రంలో మహానటి సావిత్రిగా నటించి జాతీయ అవార్డును గెలుచుకున్న ఈమెకు ఇటీవల సరైన కథా పాత్రలు అమరలేదనే చెప్పాలి. కాగా తాజాగా మరోసారి ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆమె న్యాయవాదిగా పవర్ఫుల్ పాత్రలో నటించడం విశేషం.
ఈ చిత్రం పేరు సత్యవాన్ సావిత్రి. విఘ్నేష్శివన్ శిష్యుడు ప్రవీణ్ ఎస్.విజయ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు మిష్కిన్ కీలక పాత్రను పోషిస్తున్న ఇందులో బాలశరవణన్, చారుకేష్, శిల్పామంజునాథ్, మాలా పార్వతి, దీప, ఆర్.సుందరరాజన్, వైజీ.మహేంద్రన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
వెడికారన్పట్టి శక్తివేల్ ఉమేష్ కుమార్ బన్సాల్, వైష్ణవి వివేక్ సుందర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది కోర్టులో జరిగే ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. కోర్టులో జరిగే సన్నివేశాలు ఉద్వేగభరితంగా ఉంటాయని చెప్పారు. దీనికి శ్యామ్.సీఎస్ సంగీతం, అరుళ్ విన్సెంట్ చాయాగ్రహణం మరింత బలం చేకూర్చేవిదంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు.


