ప్రస్తుతం తమిళనాడులోని ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న స్టార్ హీరో, దళపతి విజయ్కి లీకువీరులు పెద్ద షాకిచ్చారు. 'జన నాయగణ్' సినిమా మొత్తాన్ని లీక్ చేశారు. తొలుత 5 నిమిషాల సీన్స్ అని అంతా అనుకున్నారు. కానీ మూవీనే సోషల్ మీడియాలో కనిపించేసరికి అభిమానులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ట్విటర్, ఇన్ స్టా, ఫేస్బుక్ ఈ చిత్రం గురించే పెద్ద చర్చ నడుస్తోంది.
రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విజయ్, 'జన నాయగణ్' తన సినిమా అని ప్రకటించారు. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సమస్యల కారణంగా, కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఇప్పటికే అలానే ఉండిపోయింది. ఎట్టకేలకు తమిళనాడు ఎన్నికలు జరిగిన తర్వాత రిలీజ్ చేస్తారని నిర్మాతలు అనుకుంటున్నట్లు కొన్ని వార్తలొచ్చాయి. ఇంతలోనే నష్టం జరిగిపోయింది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న మూవీ మొత్తం పైరసీకి గురైనట్లు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
'జన నాయగణ్' సినిమా.. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి రీమేక్గా తెరకెక్కించారు. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. తెలుగులో శ్రీలీల చేసిన పాత్రని తమిళంలో మమిత బైజు చేసింది. అయితే సినిమాని లీక్ చేసింది ఎవరా అని ప్రస్తుతం డిస్కషన్ నడుస్తోంది. మూవీ టీమ్ నుంచి ఎవరైనా లీక్ చేశారా? లేదంటే ప్రత్యర్థి పార్టీలు విజయ్పై ఇలా కుట్ర చేస్తోందా? అని అనుకుంటున్నారు.


