Ippudu Kaka Inkeppudu : వివాదాలు వచ్చాయి..కానీ
‘‘ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే చేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? అని తొందరపడి చేసే పనులు ఎలాంటి సమస్యలను తెచ్చిపెడతాయన్నదే ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’లో చూపించాం. తల్లితండ్రులకు, పిల్లలకు మధ్య ఉండే ఓ సున్నితమైన అంశాన్ని సందేశాత్మకంగా చూపించా’’ అని డైరెక్టర్ వై. యుగంధర్ అన్నారు. హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’. చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.
చిత్రదర్శకుడు వై. యుగంధర్ మాట్లాడుతూ– ‘దర్శకులు బాపు, వాసుగార్ల వద్ద అసిస్టెంట్గా చేసి దర్శకత్వంపై అవగాహన పెంచుకుని, తొలి ప్రయత్నంగా ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ తీశా. ఈ సినిమాకి ముందే స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి కథలు తయారు చేసుకున్నాను కానీ కుదరలేదు. దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ చిత్రాన్ని కొత్తవాళ్లతో చేశాను. మా సినిమా టీజర్ విడుదల తర్వాత కొన్ని వివాదాలు వచ్చాయి. తొలి సినిమా కావడంతో పొరపాటు జరిగింది. కావాలని చేయలేదు. ప్రస్తుతం నా దగ్గర ఆరు కథలు రెడీగా ఉన్నాయి’’ అన్నారు.