ఆఫ్రికన్‌ అడవుల్లో మహేశ్‌... మారేడుమిల్లిలో ‘పుష్ప’ రాజ్‌ | Here Is About The Telugu Films Which is To Be Made in the Forest Background. | Sakshi
Sakshi News home page

ఆఫ్రికన్‌ అడవుల్లో మహేశ్‌... మారేడుమిల్లిలో ‘పుష్ప’ రాజ్‌

Mar 21 2023 8:37 AM | Updated on Mar 21 2023 8:54 AM

Here Is About The Telugu Films Which is To Be Made in the Forest Background. - Sakshi

కథ ఎక్కడికి ఆహ్వానిస్తే అక్కడికి వెళ్లాలి. కొందరు హీరోలను అడవి ఆహ్వానించింది. కేరాఫ్‌ ఫారెస్ట్‌ అంటూ ఆ హీరోలు అడవి బాట పడుతున్నారు. అడవి నేపథ్యంలో ఆ హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 

ఆఫ్రికన్‌ అడవుల్లో... 
మహేశ్‌బాబుతో ఓ భారీ యాక్షన్‌ అడ్వంచరస్‌ మూవీ ప్లాన్‌ చేశారు రాజమౌళి. ఈ సినిమా కథ ప్రధానంగా అడవిలో జరుగుతుంది. అయితే అది దేశీ అడవి కాదు... ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌. చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్‌ కొన్ని నెలల క్రితం ఇది అడవి నేపథ్యంలో సాగే సినిమా అని పేర్కొన్న విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా కీరవాణి కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రానికి అద్భుతమైన కథ కుదిరిందని కీరవాణి పేర్కొన్నారు.

రాజమౌళి గత చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి సంగీతదర్శకుడిగా వ్యవహరించి, ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో కీరవాణి ఆస్కార్‌ అందుకున్న విషయం తెలిసిందే. మహేశ్‌–రాజమౌళిల తాజా చిత్రానికి కూడా కీరవాణియే స్వరకర్త. కాగా ఈ చిత్రంలో మహేశ్‌బాబుని సరికొత్త లుక్‌లో చూపించనున్నారు రాజమౌళి. ‘పాన్‌ వరల్డ్‌’ మూవీగా ఈ ప్రాజెక్ట్‌ ఉంటుందని, విదేశీ నిర్మాతలు కూడా భాగస్వాములు అవుతారని టాక్‌. ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభం కావాల్సి ఉంది. 

అడవి రాముడు 
రాముడుగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ నటించిన చిత్రం ‘ఆది పురుష్‌’. ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ త్రీడీ పాన్‌ ఇండియా మూవీ జూన్‌ 16న విడుదల కానుంది. రాముడి జీవితంలోని ఒక అధ్యాయాన్ని తీసుకుని, ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఓం రౌత్‌. రాముడిలోని కరుణ, వీరత్వం రెండు రసాలను చూపించనున్నారు. ఈ క్యారెక్టర్‌ కోసం ప్రభాస్‌ ఫిజిక్‌ని ‘వి’ షేప్‌కి మార్చుకోమని ఓం రౌత్‌ కోరగా, పాత్రకు తగ్గట్టు మారారు.

అలాగే హిందీలో డబ్బింగ్‌ చెప్పడానికి ఆ భాష మీద పట్టు సాధించారు ప్రభాస్‌. ఏడువేల ఏళ్ల క్రితం నాటి కథను మోడ్రన్‌ టెక్నాలజీతో చూపించనున్నారు ఓం రౌత్‌. ఇందుకోసం భారీ ఎత్తున విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉపయోగించారు. ఇక ఈ కథలో కొంత భాగం అడవిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాముడు జీవితంలో అడవికి వెళ్లడం కీలకమే కదా.

మారేడుమిల్లిలో పుష్పరాజ్‌ ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు’ అంటూ పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ అద్భుతంగా ఒదిగిపోయిన తీరుని ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’లో చూశాం. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు రెండో భాగం ‘పుష్ప: ది రూల్‌’ రెడీ అవుతోంది. తొలి భాగంలో మారేడుమిల్లి ఫారెస్ట్‌ కీలకం. మలి భాగంలోనూ అడవి బ్యాక్‌డ్రాప్‌ ఉంటుంది. తొలి భాగంలో కథానాయికగా నటించిన రషి్మకా మందన్నా, పోలీస్‌ పాత్ర చేసిన ఫాహద్‌ ఫాజిల్, నెగటివ్‌ రోల్‌ చేసిన సునీల్‌ ఇంకా అనసూయ వంటి ఆరి్టస్టులు మలి భాగంలోనూ ఉంటారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. 

నితిన్‌ కూడా మారేడుమిల్లిలోనే... 
లవర్‌బాయ్‌ క్యారెక్టర్స్‌ని నితిన్‌ చాలానే చేశారు. కొంచెం మాస్‌ టచ్‌ ఉన్న పాత్రలూ చేశారు. అయితే అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ క్యారెక్టర్‌లో ఇప్పటివరకూ కనిపించలేదు. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అలాంటి పాత్ర చేస్తున్నారు నితిన్‌. గడ్డం, మీసాలతో ఫుల్‌ మాస్‌గా కనిపించనున్నారీ హీరో. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ని మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ఆరంభించారు. ఈ చిత్రకథ ప్రధానంగా అడవి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలవుతుంది. అడవి చుట్టూ తిరిగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement