
దుబాయిలో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు గామా (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) పురస్కారాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు ఐదో ఎడిషన్ వేడుకలు ఈనెల 30 నుంచి షార్జా ఎక్స్పో సెంటర్లో గ్రాండ్గా జరగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు. గామా సీఈవో సౌరభ్ కేసరి, వైభవ్ జ్యువెలర్స్ ఎండీ రాఘవ్, జ్యూరీ సభ్యులు ప్రముఖ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, బి.గోపాల్, హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగర్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గామా సీఈవో సౌరభ్ మాట్లాడుతూ.. 'ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈవెంట్ కాదు. మా నాన్నకు(త్రిమూర్తులు) కళాకారులపై ఉన్న అభిమానంతో గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నాం. అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాం. వచ్చే ఏడాది మరింత గ్రాండ్గా అవార్డ్స్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నాం. దుబాయిలోని తెలుగువారితోపాటు ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా ఈవెంట్ నిర్వహించబోతున్నాం. మా జ్యూరీ సభ్యుల సహకారంతో అవార్డు విజేతలను ఎంపిక చేశామని చెప్పుకొచ్చారు. ఆగస్టు 30న టాలీవుడ్ అవార్డ్స్తో పాటు ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకని నిర్వహించేలా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్.. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్తో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొనబోతున్నారు. హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, పూజా హెగ్డే, శ్రీదేవి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.