టాలీవుడ్‌ డైరెక్టర్‌, నటుడు సూర్యకిరణ్‌ ఇకలేరు! | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ డైరెక్టర్‌, నటుడు సూర్యకిరణ్‌ ఇకలేరు!

Published Mon, Mar 11 2024 2:48 PM

Director Surya Kiran Passed Away - Sakshi

రచయిత, దర్శకుడు సూర్య కిరణ్‌ (51) కన్నుమూశారు. టాలీవుడ్‌లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో  ప్రేక్షకులను మెప్పించిన ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించారని తెలుస్తోంది. 'మాస్టర్‌ సురేష్‌' పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించిన ఆయన  బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో  కంటెస్టెంట్‌గా కొనసాగిన విషయం తెలిసిందే. కానీ మొదటి వారంలోనే ఆయన ఎలిమినేట్‌ అయ్యాడు. ఆ సమయంలో హౌస్‌లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్‌ ఎలాంటి వారో ఆయన చెప్పిన తీరు అందరినీ మెప్పించింది. ఆ షో ద్వారా  తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. 


(మాజీ సతీమణి కళ్యాణితో సూర్యకిరణ్‌)

హీరోయిన్ కళ్యాణిని ప్రేమ పెళ్లి చేసుకున్న‌ సూర్యకిరణ్‌ పలు మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయంలో ఆయన పలు కాంట్రవర్శీలతో వార్తల్లో నిలిచాడు. బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులను అందుకున్న సూర్య కిరణ్‌.. దర్శకుడిగా రెండు నంది పురస్కారాలను అందుకున్నాడు. సూర్యకిరణ్‌ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.మంగళవారం ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.

అప్పులు జీవితాన్ని ముంచేశాయి: సుజిత
కళ్యాణితో విడాకుల గురించి సూర్య కిరణ్‌ చెల్లెలు అయిన బుల్లితెర నటి సుజిత గతంలో కొన్ని విషయాలు పంచుకున్నారు. కళ్యాణితో వివాహం జరిగిన తర్వాత నిర్మాతగా సూర్యకిరణ్‌ ఒక సినిమాను నిర్మించినట్లు సుజిత తెలిపింది. కానీ ఆ సినిమా డిజాస్టర్‌ కావడంతో భారీగా నష్టాలు వచ్చాయని ఆమె పేర్కొంది. అదే తన అన్నయ్య జీవితంలో వచ్చిన పెద్ద సమస్య అంటూ సుజిత తెలిపింది. తన అన్నయ్యకు సాయం చేద్దామనుకునేలోపు శక్తికి మించిన అ‍ప్పులు చుట్టిముట్టినట్లు ఆమె చెప్పింది. దీంతో సూర్యకిరణ్‌ కుటుంబం మరీ దారుణ స్థితిలోకి వెళ్లింది. అన్నీ అప్పులు, ఉన్నదంతా అమ్మేశారు. కేరళలో మంచి ప్రాపర్టీ ఉండేది, దాన్ని కూడా అమ్మేశారు. ఈ ఒక్క పని వళ్ల తన అన్నయ్య సూర్యకిరణ్‌ జీవితాన్ని ముంచేసిందని సుజిత తెలిపింది. 

Advertisement
Advertisement