తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్. 'ధురంధర్ 2' మేకర్స్ హ్యాండ్ ఇచ్చేశారు. రిలీజ్ నాడు పడాల్సిన తెలుగు వెర్షన్ షోలన్నీ రద్దయిపోయాయి. ఈ మేరకు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ మెసేజులు వెళ్తున్నాయి. టికెట్ డబ్బులని తిరిగి ఇచ్చేస్తామని అందులో పేర్కొన్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది? తెలుగు షోలు ఎప్పటి నుంచి ఉండొచ్చు?
(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
గతేడాది డిసెంబరు తొలివారంలో వచ్చిన 'ధురంధర్'.. 50 రోజులకు పైనే థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైంది. తర్వాత ఓటీటీలోకి వస్తే అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తొలి పార్ట్ రిలీజైనప్పుడే సీక్వెల్.. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ కూడా ఈసారి ఉంటాయని మాటిచ్చారు. కానీ ఇప్పుడది తప్పారు.
18వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి తెలుగు షోలు ఉంటాయని చెప్పినప్పటికీ వాటిని రద్దు చేశారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఆదిత్య ధర్.. రాత్రి 9 గంటల నుంచి ఉంటాయని పోస్ట్ పెట్టాడు. రాత్రి సంగతి పక్కనబెడితే తర్వాత అంటే 19వ తేదీ అయిన ఈ రోజు కూడా హైదరాబాద్లో తెలుగు వెర్షన్ షోలు రద్దయ్యాయి. డబ్బింగ్ ఇంకా పూర్తిగా జరగకపోవడం, చివరి నిమిషంలో హడావుడి లాంటివి సమస్యలుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి బుక్ మై షోలో 20వ తేదీకి తెలుగు షోలు ఉన్నప్పటికీ.. అవి అయినా వేస్తారా లేదా అనేది సందేహమే?
'ధురంధర్ 2' విషయానికొస్తే.. రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు.
అసలు భారత్పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష)


