స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన 'ధురంధర్' నుంచి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రింట్స్ టైంకి రాకపోవడంతో తెలుగు వెర్షన్ ప్రీమియర్స్ మాత్రం రద్దయ్యాయి. గురువారం ఉదయం నుంచి తెలుగు షోలు యధావిధిగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికైతే మూవీపై ఓ రేంజ్ బజ్ ఉంది. దానికి తోడు దర్శకుడు కూడా చివరివరకు కూర్చోండి, ట్విస్టులు బయటపెట్టొద్దని చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. మరోవైపు సీక్వెల్ కోసం నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)
మిగతా పాన్ ఇండియా సినిమాల్లా 'ధురంధర్' రెండు భాగాల షూటింగ్స్ వేర్వేరుగా చేయలేదు. మొత్తం ఒకేసారి కలిపి తీసేశారు. గత నెలలో ప్యాచ్ వర్క్స్ లాంటివి చేశారు. అయితే రెండు భాగాలకు కలిపి నటీనటులకు ఒకేసారి రెమ్యునరేషన్స్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. హమ్జా అలీ, జస్కీరాత్ సింగ్ అనే రెండు పాత్రలు చేసిన రణ్వీర్ సింగ్కి అత్యధికంగా రూ.40-50 కోట్ల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
రణ్వీర్ కంటే ఎక్కువగా మూవీలో హైలైట్ అయింది అక్షయ్ ఖన్నా చేసిన రహమాన్ డకాయిట్ పాత్ర. తొలి భాగంలోనే రహమాన్ రోల్ ముగిసింది. కానీ సీక్వెల్లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో ఈ పాత్ర కనిపించనుందట. మొత్తంగా దీనికోసం అక్షయ్ ఖన్నాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.
ఎస్పీ అస్లాం చౌదరిగా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంజయ్ దత్.. మొత్తంగా రూ.10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడట. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాత్ర చేసినందుకుగానూ మాధవన్కి రూ.9 కోట్లు, మేజర్ ఇక్బాల్ అనే విలనీ పాత్రలో నటించిన అర్జున్ రాంపాల్, హీరోయిన్గా చేసిన సారా అర్జున్ తలో రూ.కోటి రెమ్యునరేషన్గా అందుకున్నారట. ఇక దర్శకుడు, నిర్మాత అయిన ఆదిత్య ధర్ పారితోషికం గురించి అయితే ఎక్కడా వివరాలు లేవు. కానీ ఈ మూవీ వల్ల ఆదిత్య ధర్ బ్రాండ్ ఇమేజ్ చాలా పెరిగిపోయింది. తర్వాత చేయబోయే చిత్రం ఏంటో తెలియనప్పటికీ.. ఒకవేళ ఏ నిర్మాత అప్రోచ్ అయినా సరే భారీ రెమ్యునరేషన్ అయితే డిమాండ్ చేయడం గ్యారంటీ.
'ధురంధర్' విషయానికొస్తే.. మన దేశంపై పాకిస్తాన్ చేస్తున్న వరస దాడులు ఆగాలంటే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) భావిస్తాడు. ఆపరేషన్ ధురంధర్కి శ్రీకారం చుడతాడు. ఇందులో భాగంగా జైలుజీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్)ని మారుపేరుతో పాకిస్తాన్కి పంపిస్తాడు. జ్యూస్ షాపులో పనిచేసే దగ్గర నుంచి రహమాన్ డకాయిట్ అనే కరుడుగట్టిన గ్యాంగ్స్టర్కి ఆత్మీయుడు అయ్యేంతవరకు ఎలా ఎదిగాడు? ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. రహమాన్ డకాయిట్ని హమ్జా చంపడంతో తొలి భాగం ముగిసింది. రెండో పార్ట్లో హమ్జా.. లయారీకి ఎలా డాన్ అయ్యాడు? భారత్ని దాడులు చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడనేది చూపించబోతున్నారు.
(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్)


