ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన టాలీవుడ్.. ఇప్పుడు అనుకోని విధంగా ఓ జియో పొలిటికల్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనికి 'చైనా పీస్' అనే తెలుగు మూవీ కారణం. ఈ చిత్రాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపినట్లు వార్తలొస్తున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సాగే కథాంశం ఇందులో ఉండటమే ఇంత రచ్చ జరగడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. బాలీవుడ్లో రీసెంట్గా వచ్చిన 'ధురంధర్', త్వరలో రాబోతున్న సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' కూడా ఈ తరహా కాన్సెప్ట్లతోనే తీశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
యుద్ధ నేపథ్యంలో ఉండే భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే సాధారణంగా విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి వెళ్తుంటాయి కానీ పెద్దగా ప్రచారం లేని ఓ తెలుగు మూవీ ఈ రేంజ్లో హైలైట్ కావడంతో.. అందులో కంటెంట్ ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సరిహద్దు వివాదాలు లేదా అంతర్జాతీయ సంబంధాలకు భంగం కలిగించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్లో ఇలా ఓ సినిమా.. జియో పొలిటకల్ వివాదంలో ఇరుక్కోవడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.
ఈ సినిమా కేవలం యాక్షన్ డ్రామానా? లేక భారతదేశం- ఇతర దేశాల మధ్య ఉన్న రహస్య దౌత్య సంబంధాలను ఏమైనా టచ్ చేసిందా? అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే దీని వెనుక ఏదో పెద్ద కథే ఉందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి వచ్చే క్లియరెన్స్పై ఈ చిత్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్)


