తెలుగు హీరోల్లో అల్లరి నరేశ్ ఒకడు. అప్పట్లో కామెడీ సినిమాలు చేసి బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అన్ని రకాల జానర్స్ ప్రయత్నిస్తున్నాడు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కావట్లేదు. దీంతో రీసెంట్గా హారర్ క్రైమ్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పుడా చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.
'పొలిమేర' రెండు సినిమాలతో మెప్పించిన దర్శకుడు అనిల్ విశ్వనాథ్.. షో రన్నర్గా వ్యవహరించిన సినిమా '12ఏ రైల్వే కాలనీ'. అల్లరి నరేశ్, కామాక్షి భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. గత నెల 21న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఘోరమైన ఫ్లాప్గా నిలిచింది. దీంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
'12ఏ రైల్వే కాలనీ' విషయానికొస్తే.. కార్తీక్ (అల్లరి నరేశ్) అనాథ. వరంగల్లోని రైల్వే కాలనీలో ఫ్రెండ్స్తో కలిసి బతుకుతుంటాడు. లోకల్ రాజకీయ నాయకుడు టిల్లు(జీవన్)కి నమ్మిన బంటు. గతంలో రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన టిల్లు.. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్మే కావాలని అనుకుంటూ ఉంటాడు. ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ఓ బాధ్యతని కార్తీక్కి అప్పజెబుతాడు. దానిలో భాగంగా యువతను ఆకర్షించేందుకు కార్తీక్ ఓ ఆటల పోటీ నిర్వహిస్తాడు. ఆ పోటీల్లోనే ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను చూసి మనసు పారేసుకుంటాడు.
ఓరోజు కార్తీక్కి టిల్లు ఓ పార్సిల్ ఇచ్చి దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టమని చెప్తాడు. దీంతో దాన్ని దాచేందుకు దొంగతనంగా ఆరాధన ఇంటికి వెళ్లగా.. అక్కడ తనకు ఊహించని పరిణామం ఎదురవుతుంది. అప్పటిదాక కింద గదిలో తనతో మాట్లాడిన తన ప్రేయసి.. తల్లితో సహా పైగదిలో హత్యకు గురవడం కార్తీక్ని షాక్కు గురి చేస్తుంది. తర్వాత ఏం జరిగింది? అసలు ఆరాధన ఎవరు? ఈ హత్యలకు కారణమేంటి అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: మీరు తిట్టకపోతే 'రాజాసాబ్' తీసేవాడిని కాదు: మారుతి)


