కేవీకే శాస్త్రవేత్త రవికుమార్
టేక్మాల్(మెదక్): రైతులు అధిక దిగుబడులు పొందాలంటే సహజ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలని తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సుపోషణ– భూ సంరక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని బొడ్మట్పల్లిలో జొన్న పంటను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన పంటల సంరక్షణ, అధిక దిగుబడి సాధించడానికి రైతులు చేపట్టాల్సిన చర్యలు, నూతన యాజమాన్య పద్ధతులు, భూ సారవంతం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎప్పుడూ ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేస్తే ఎక్కువ దిగుబడులు పొందవచ్చన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలతో పంటలు సాగు చేయాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి రాంప్రసాద్, టెక్నికల్ ఏడీఏ వినయ్కుమార్, టెక్నికల్ ఏఓ వందన, పలువురు రైతులు ఉన్నారు.


