మెదక్ కలెక్టరేట్: పొట్టదశలో ఉన్న వరి పంటలు నీటి తడులు లేక ఎండిపోతున్నాయని, సింగూరు నుంచి నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టర్ ప్రతిమాసింగ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పలు మండలాల్లో వరి పొట్టదశలో ఉందని, నీరందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టకు అత్యవసరంగా 0.3 టీఎంసీల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. క్రాప్ హాలిడే ప్రకటించకముందే రైతులు పంటలు వేసుకున్నారని తెలిపారు. ఆలస్యంగా ప్రకటించడం వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. రైతుల పంటలు ఎండిపోతున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. రెండు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లావణ్యరెడ్డి, కృష్ణారెడ్డి, లింగారెడ్డి, కౌన్సిలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


