మెదక్ కలెక్టరేట్: జిల్లాలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న మూడు నెలల రేషన్ బియ్యం తీరును డీఎస్ఓ నిత్యానంద్ శనివారం పరిశీలించారు. మొత్తం 520 రేషన్ దుకాణాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. అలాగే ఈనెలాఖరు వరకు బియ్యం పంపిణీ చేస్తామన్నారు. లబ్ధిదారులు ఆందోళన లేకుండా సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం తెచ్చుకోవాలని సూచించారు. డీలర్లు అక్రమాలకు పాల్ప డకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ, పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం పట్టణంలోని పలు పెట్రోల్ బంక్లను సందర్శించి రికార్డులు పరిశీలించారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే పలు హోటళ్లు, రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు నిర్వహించి 134 సిలిండర్లను సీజ్ చేశామన్నారు. 83 మంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గ్యాస్ విషయంలో సమస్యలు ఎదురైతే 9391942254 నంబర్లో సంప్రదించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 87 పెట్రోల్ బ్యాంకులు, 16 ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు సక్రమంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
డీఎస్ఓ నిత్యానంద్


