
పండుగకు పస్తులేనా..?
పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కరువు
నిలిచిన చెత్త సేకరణ
నెలల తరబడి వేతనాలు అందక.. అప్పులు చేయలేక.. పస్తులు ఉండలేక.. దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికులు. పండుగ రోజుల్లోనూ కుటుంబంతో పస్తులుండాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్జోన్: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పనిచేస్తూ గ్రామాలను అద్దంలా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. పల్లెలను నిత్యం పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు రాక ఇక్కట్లకు గురవుతున్నారు. మరికొన్ని గ్రామాల్లోని కార్మికులకు 3 నుంచి 4 నెలలుగా వేతనాలు అందలేదు. అసలే చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, సమయానికి జీతం రాక మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.
492 జీపీలు.. 1,673 మంది కార్మికులు
జిల్లావ్యాప్తంగా 21 మండలాలు 492 పంచాయతీ లు ఉండగా, 7.24 లక్షల మంది జనాభా ఉన్నారు. కాగా గత ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ కోసం గ్రామానికో ట్రాక్టర్ను కేటాయించింది. గ్రామాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన ఒక్కో గ్రామానికి 3 నుంచి 5 మంది చొప్పున మొత్తం 1,673 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. ఒక్కో కార్మికుడికి నెలకు రూ. 9,500 చొప్పున వేతనాలు చెల్లించింది. కాగా కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో మెజార్టీ గ్రామాల్లో కార్మికులకు గత రెండు మాసాలుగా వేతనాలు రావటం లేదు. మరికొన్ని గ్రామాల కార్మికులకు 3 నుంచి 4 నెలలుగా అందటం లేదు. దీంతో బతుకమ్మ, దసరా పండుగకు కుటుంబాలు పస్తులుండే పరిస్థితి నెలకొందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బంది పడుతున్నాం
మాకు నాలుగు నెలల నుంచి జీతం రావడం లేదు. దసరా పండుగకు కుటుంబ సభ్యులకు కనీసం బ ట్టలు కొనలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు జీతాలు ఇప్పించి ఆదుకోవాలి.
– పద్మయ్య, పారిశుద్ధ్య కార్మికుడు
●
రెండు నెలలుగా తప్పని ఎదురుచూపులు
భారంగా మారిన కుటుంబ పోషణ
గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసి సుమారు రెండు సంవత్సరాలు కావొస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. చెత్త సేకరణ కోసం ఉపయోగించే ట్రాక్టర్లలో కొంతకాలం పాటు పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి డీజిల్ పొయించారు. తలకు మించిన అప్పులు కావడంతో ఇక మాతో చెత్త సేకరణ కాదని చేతులెత్తేశారు. దీంతో జిల్లాలోని అనేక గ్రామాల్లో చెత్త సేకరణ నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త సేకరణ నిలిచిపోవటంతో పల్లెల్లో వ్యాధులు ముసురుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 20 డెంగీ కేసులు నమోదు కాగా, టైఫాయిడ్ 46, డయేరియా 71 కేసులు నమోదయ్యాయి. 18,426 మంది విషజ్వరాల బారినపడ్డారు.

పండుగకు పస్తులేనా..?