
కుమ్మేసిన వాన
మెదక్లో అత్యధికంగా 17 సెం.మీ వర్షపాతం
● కొల్చారంలో 8 సెం.మీ నమోదు ● లోతట్టు ప్రాంతాలు జలమయం ● పలువురి ఇళ్లలోకి చేరిన వరద ● ఇబ్బంది పడిన వాహనదారులు
మెదక్జోన్: భారీ వర్షంతో మెదక్ మరోసారి అతలాకుతలం అయింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా రాందాస్ చౌరస్తాలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం నీరు భారీగా నిలిచింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు దుకాణాల్లోకి నీరు చేరింది. స్పందించిన మున్సిపల్ అధికారులు అడ్డుగా ఉన్న డివైడర్ను జేసీబీతో తొలగించారు. అలాగే పట్టణంలోని గాంధీనగర్లో పలువురి ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు అవస్థలు పడ్డారు. బృంధావన్నగర్, ఫతేనగర్, సాయినగర్, నర్సిఖేడ్ కాలనీలు జలమయం అయ్యాయి. అలాగే మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 17 సెంటీ మీటర్లు, కొల్చారం మండలంలో 8 సెం.మీ, హవేళిఘణాపూర్లో 6 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
మళ్లీ వణికిన మెతుకుసీమ
గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి మెదక్ పట్టణం అంతా జలమయం అయింది. పట్టణాన్ని ఆనుకొని ఉన్న పుష్పలవాగు ఉధృతి మళ్లీ ప్రారంభం కావటంతో సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ మళ్లీ నీట మునుగుతుందా.. అంటూ జనం భయాందోళన వ్యక్తం చేశారు. వర్షం తగ్గటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కలెక్టర్ పరిశీలన
జిల్లా కేంద్రంలో భారీగా వర్షం కురవడంతో కలెక్టర్ రాహుల్రాజ్ లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. అధికారులకు తగు సూచనలు చేశా రు. ఇందులో భాగంగా ఎస్సీ బాలుర వసతి గృహం, బాలికల పాలిటెక్నిక్, బాలికల కళాశాలను స్వయంగా పరిశీలించారు. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పట్టణంలోని ప్రధాన రహదారిపై పోటెత్తిన వరద

కుమ్మేసిన వాన