జిల్లాల్లో క్యాన్సర్‌ డే కేర్‌ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాల్లో క్యాన్సర్‌ డే కేర్‌ కేంద్రాలు

Sep 10 2025 6:30 AM | Updated on Sep 10 2025 7:37 AM

జిల్లాల్లో క్యాన్సర్‌ డే కేర్‌ కేంద్రాలు

జిల్లాల్లో క్యాన్సర్‌ డే కేర్‌ కేంద్రాలు

సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసిందని, క్యాన్సర్‌ వ్యాధి చికిత్సను ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని జిల్లాల్లో క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్ల ప్రారంభం ద్వారా ఆ వ్యాధిపై పోరాటానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి వైద్య ఆరోగ్య కళాశాల నుంచి వర్చువల్‌ విధానంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్లను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ...ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడంతో వ్యాధి నిర్ధారణలోనూ, చికిత్స అందించడంలోనూ జరిగే జాప్యం కారణంగానే చాలామంది ప్రాణాలు కో ల్పోతున్నారన్నారు. ఇకమీదట అలా జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్‌ నిర్మూలన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. కార్యక్రమానికి అడ్వైజర్‌గా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్యాన్సర్‌ వ్యాధి నిపుణుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయను నియమించిందని వెల్లడించారు. క్యాన్సర్‌ వ్యాధి నియంత్రణలో ఆయన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్న నమ్మకాన్ని మంత్రి ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్లలో రోగులకు సమయానుకూల స్క్రీనింగ్‌ పరీక్షలు, రేడియేషన్‌, పాలియేటివ్‌ కేర్‌ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. త్వరలో అన్ని జిల్లాలలో మొబైల్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ వాహనాలను సైతం అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిమ్స్‌, ఎన్‌ఎంజే ఆస్పత్రులలో 80 పడకల క్యాన్సర్‌ ప్రత్యేక విభాగాలు కొనసాగుతున్నాయని, త్వరలో వరంగల్‌, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో క్యాన్సర్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

నర్సింగ్‌ విద్యార్థులకు విదేశీ భాషలపై శిక్షణకు ఒప్పందం

రాష్ట్రంలో ప్రతి ఏటా 3,000 మంది నర్సింగ్‌ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. నర్సింగ్‌ విద్యార్థులకు జర్మన్‌, ఇంగ్లిష్‌లతోపాటు పలు విదేశీ భాషల్లో శిక్షణనివ్వడం కోసం ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)తో వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఒప్పందం వల్ల నర్సింగ్‌ విద్యార్థులకు విదేశీ భాషలపై ప ట్టు సాధించేలా ఇఫ్లూ అధ్యాపకులు శిక్షణనిస్తారని వెల్లడించారు. ఈ శిక్షణతో నర్సింగ్‌ విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోగ్తూ, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ రవీంద్రకుమా ర్‌, అదనపు డీఎంఈ డాక్టర్‌ వాణి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌ పి.ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్మన్‌ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, వైద్య కళాశాల అధ్యాపకులు, జీజీహెచ్‌ సూప రింటెండెంట్‌, వైద్యులు, నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.

డే కేర్‌ సెంటర్ల ప్రారంభోత్సవంలోమంత్రి దామోదర

త్వరలో అందుబాటులోకి క్యాన్సర్‌స్క్రీనింగ్‌ టెస్ట్‌ వాహనాలు

డాక్టర్‌ నోరి దత్తాత్రేయ అడ్వైజర్‌గా క్యాన్సర్‌ నిర్మూలన కార్యక్రమం

నర్సింగ్‌ విద్యార్థులకు విదేశీ భాషల శిక్షణ కోసం ఇఫ్లూతో ఒప్పందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement