
సృజనాత్మకంగా బోధిస్తూ.. ఉన్నతంగా తీర్చిదిద్దుతూ..
అందరి నేస్తం.. ఆపన్నహస్తం
ఇటీవల వజ్ర అవార్డుతో
ప్రశాంత్కు సన్మానం..
వర్గల్ (గజ్వేల్):
ఆధునిక హంగులతో చదువులకు వన్నెలద్దడమేకాకుండా.. రక్తదానాలతో స్పందించే హృదయంగా పేరొందారు వర్గల్ మండలం చాంద్ఖాన్మక్త ప్రైమరీస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వరాల ప్రశాంత్. 2002లో నాచారం స్కూల్ టీచర్గా, శాకారం హెచ్ఎంగా, ప్రస్తుతం చాంద్ఖాన్మక్త హెచ్ఎంగా కొనసాగుతున్న ప్రశాంత్ ఆయా పాఠశాలలపై తనదైన ముద్ర వేశారు. సొంతంగా డబ్బు వెచ్చిస్తూనే, మిత్రులు, దాతల సహకారంతో డిజిటల్ క్లాస్రూమ్స్, తరగతి గోడలకు బోధన సంబంధ అంశాలతో ఎనామిల్ పెయింటింగ్స్, ఆకట్టుకునే బొమ్మలతో బడి వాతావరణాన్ని చదువుల నెలవుగా తీర్చిదిద్దారు. విద్యార్థులలో సామాజిక స్పృహ పెంపొందింపజేస్తూ.. శాకారం స్కూల్ను నందనవనంగా తీర్చిదిద్దారు. ఆయన కృషిని అభినందిస్తూ 2020–21 ‘రైస్ అండ్ షైన్’ ఎన్సీఈఆర్టీ జాతీయస్థాయి మ్యాగజైన్లో శాకారం పాఠశాల సక్సెస్స్టోరీ ప్రచురితం చేశారు. రేడియో పాఠాల రూపకల్పన, ఉపాధ్యాయ శిక్షణ మాడ్యూల్స్ తయారీ, పాఠ్యపుస్తకాల రచనలోనూ ప్రశాంత్ భాగస్వామిగా నిలిచారు.
పిల్లల మానసిక అభివృద్ధికి..
గత వేసవి సెలవులలో మొబైల్ ఫోన్లకు పిల్లలు అతుక్కుపోకుండా ఉండడానికి పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి డిజిటల్ డీటాక్స్ పేరుతో 21రోజులు, 21 రకాల కార్యక్రమాలతో సమాజానికి సరికొత్త విధానం పరిచయం చేశారు. అతని సేవలకు గుర్తింపుగా 2021లో మండల స్థాయి, 2022లో జిల్లా స్థాయి, అదేసంవత్సరం రాష్ట్రస్థాయి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అవార్డు, 2023లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. తాజాగా 2025 జూన్లో సేవారంగంలో వజ్ర పురస్కారం సొంతమైంది. కేవలం బోధనకే పరిమితం కాకుండా 74 సార్లు రక్తదానం, 3 సార్లు ప్లేట్లెట్లు దానం చేసి ఆపదలో స్పందించే హృదయంగా పేరొందారు. అటు చదువులకు, సమాజానికి ఉపయుక్తంగా నిలుస్తూ అందరి నేస్తంగా అభినందనలు చూరగొంటున్నారు.
డిజిటల్ హంగులు కల్పించి.. 74సార్లు రక్తదానం చేసి
పాఠశాలలపై ‘ప్రశాంత్’ ముద్ర
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): విద్యార్థులతో కలిసి ఆడుతారు పాడుతారు.. వారి పక్కనే నేలపై కూర్చుంటారు.. వారిని అక్కున చేర్చుకొని పాఠాలు చెబుతారు.. అందుకే ఆయనంటే విద్యార్థులకు చాలా ఇష్టం. విద్యార్థులంటే ఆయనకు ప్రాణం. ఆయనే సదాశివపేట మండలం మెలగిరిపేట్, అంకేనపల్లి, చందాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో 28 ఏళ్లుగా విధులు నిర్వహించిన హెచ్ఎం బి.అశోక్ కుమార్. మరోవైపు రోటరీ క్లబ్ కార్యదర్శిగా, వాసవీ క్లబ్ అధ్యక్షుడిగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. తాను పని చేసే పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు, విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, టై, బెల్ట్, గ్లాసులు, ప్లేట్స్తో పాటుగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా తరగతి గదులను సొంత డబ్బుతో వాల్ పెయింటింగ్ తో అందంగా తీర్చిదిద్దారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను వినియోగిస్తూ విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగేలా సృజనాత్మకంగా బోధిస్తున్నారు. హెచ్ఎం అశోక్ కుమార్ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను సైతం అందజేసింది. వచ్చే ఏడాది ఆగస్టులో అయన పదవీ విరమణ పొందనుండగా, ఇటీవల మునిపల్లికి బదిలీపై వెళ్లారు.

సృజనాత్మకంగా బోధిస్తూ.. ఉన్నతంగా తీర్చిదిద్దుతూ..