
ఉన్నత లక్ష్యంతో చదవాలి
పెద్దశంకరంపేట(మెదక్): జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో చదవాలని బంగారుతల్లి ప్రేరణ అంబాసిడర్, ట్రైనర్ సంతోష్కుమార్ అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టైమ్ మేనేజ్మెంట్, లైఫ్స్కిల్స్, కేరియర్ గైడెన్స్, స్టడీ స్కిల్స్, ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని, జీవితంలో విజయం సాధించే అంశాలపై ఆయన విద్యార్థులకు వివరించారు. అనంతరం వారికి పలు క్విజ్ పోటీలను నిర్వహించి ఎంఈఓ వెంకటేశం చేతులమీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్ధిరాములు తదితరులున్నారు.
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని నందిగామ గ్రామ శివారులో ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి కుంగింది. దీంతో మెదక్ – సిద్దిపేట జాతీయ రహదారి 765 డి పనులు పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే వాహనాదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి. నందిగామ గ్రామ శివారులో కుంగిన బ్రిడ్జికి ప్రక్కనే మరో మట్టి రోడ్డును నిర్మిస్తున్నారు.
రామాయంపేట(మెదక్): భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు మంగళవారం స్థానిక లయన్స్ క్లబ్ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. క్లబ్ జిల్లా గవర్నర్ అమర్నాథ్, స్థానిక సీఐ వెంకట్ రాజాగౌడ్, ఎస్ఐ బాల్రాజు బాధితులకు అందజేశారు. క్లిష్ట పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడం గొప్ప విషయమని సీఐ పేర్కొన్నారు. క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. క్లబ్ ప్రతినిధులు దీప్చంద్, దామోదర్రావు, శ్రీనివాసరావు, బాలరాజు, గురువయ్య, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
రేగోడ్(మెదక్): నంబర్ ప్లేట్ లేకుండా కనిపిస్తే వాహనాన్ని సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పోచయ్య హెచ్చరించారు. మండలంలోని వెంకటాపూర్ చౌరస్తా వద్ద మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో నంబర్ ప్లేట్ లేని నాలుగు వాహనాలను పట్టుకుని వాహనాలకు నంబర్ వేయించి వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లా డు తూ వాహనదారులు సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. మధ్యం తాగి వాహనా లు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం మండలంలో 20 మందికి ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరు చేసింది. మంగళవారం చెక్కులను వట్పల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మి లబ్ధిదారులకు అందజేశారు. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులను తహసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేషారెడ్డి, నాయకులు బల్రాం, సుభాశ్రావ్, నర్సింహరెడ్డి, బాలకిషన్, బేతయ్య, పాల్గొన్నారు.
జహీరాబాద్: మండలంలోని హుగ్గెల్లి గ్రామంలో ఆయిల్ పామ్ పంటసాగుపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. మంగళవారం హెచ్ఈఓ విఠల్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంటను సాగు చేయడం ద్వారా దీర్ఘకాలికంగా లబ్ధి పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా సాగు పద్ధతులు, ప్రభుత్వ సబ్సిడీల గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలని హెచ్ఈఓ విఠల్ కోరారు.
అవినీతిపరులకు శిక్ష తప్పదు
చిన్నకోడూరు(సిద్దిపేట): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపరులకు శిక్ష తప్పదని డీసీసీ కార్యదర్శి మీసం నాగరాజు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పీసీ ఘోష్ నివేదికను ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిందన్నారు. త్వరలోనే అవినీతిపరులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

ఉన్నత లక్ష్యంతో చదవాలి