
బడి పిల్లలకు రాగి జావ
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్న ప్రభుత్వం.. మరింత పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో రాగి జావను అందజేయాలని నిర్ణయించింది. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఈ పథకాన్ని తిరిగి పునః ప్రారంభించింది. నేటి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ రాగిజావ అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
– రామాయంపేట(మెదక్)
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,186 పాఠశాలల్లో చదువుతున్న 2.51 లక్షల మంది విద్యార్థులకు రాగిజావ పంపిణీ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అయితే ఇంటి నుంచి ఉదయం ఖాళీ కడుపుతో పాఠశాలలకు బయలుదేరే చిన్నారులు తరగతి గదుల్లో అలసి పోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం ఉదయం అల్పాహారంగా బెల్లంతో కూడిన రాగిజావ అందజేస్తే ప్రయోజనకరంగా ఉండడంతోపాటు విద్యార్థులు పౌష్టికాహారం అందుతుందని భావించింది. ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే జిల్లాలోని మక్త భూపతిపూర్ పాఠశాలలో సోమవారం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
జిల్లా పాఠశాలలు విద్యార్థులు
మెదక్ 882 77,000
సంగారెడ్డి 1,265 1,02,000
సిద్దిపేట 941 72,000
రెండున్నర నెలల తర్వాత..
ఈ ఏడాది జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవ్వగా.. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఈ పథకం అమలు కానుంది. గతంలో మాదిరిగా సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు సహకారంతో పథకాన్ని అమలు చేయనుంది. ట్రస్టు 60 శాతం వ్యయం భరిస్తుండగా.. 40 శాతం ప్రభుత్వం భరించి ఈ పథకాన్ని అమలు చేయనుంది. ప్రతీ గ్లాసుకు ప్రభుత్వం రూ. 25 పైసల చొప్పున చెల్లించనుండగా.. వారంలో మూడు రోజుల పాటు ప్రతీ విద్యార్థికి రోజుకు 10 గ్రాముల రాగిపొడి, 10 గ్రాముల బెల్లం పొడి ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే వారంలో మూడు రోజులు కోడిగుడ్లు ఇవ్వని రోజుల్లో రాగిజావ అందించనున్నారు. మిగితా మూడు రోజులు గుడ్డు అందించనున్నారు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి రావిజావ పంపిణీ నిలిచిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. కాగా, జిల్లాలోని అన్ని మండలాలకు ఇప్పటికీ రాగి జావ, బెల్లం ప్యాకెట్లు చేరుకోలేదు. రెండు రోజుల్లో ఎమ్మార్సీలు, అక్కడి నుంచి పాఠశాలలకు వీటిని చేరవేయనున్నారు.
నేటి నుంచి పంపిణీకి శ్రీకారం
ఉమ్మడి జిల్లాలో 2.51 లక్షల మంది విద్యార్థులకు మేలు
నేడు మక్త భూపతిపూర్ స్కూల్లో ప్రారంభం
విద్యార్థులకు ప్రయోజనం
ఆరోగ్యపరంగా విద్యార్థులకు రాగి జావ చాలా మంచిది. విద్యార్థులు చురుగ్గా ఉండి బాగా చదువుకోవడానికి ఈ పానీయం దోహదపడుతుంది. రెండు, మూడు రోజుల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు పరుస్తాం. సోమవారం మక్త భూపతిపూర్ పాఠశాలలో పథకం ప్రారంభిస్తున్నాం.
– రాధాకిషన్, జిల్లా విద్యాధికారి

బడి పిల్లలకు రాగి జావ