
బీసీలకు కాంగ్రెస్ అన్యాయం
ఎమ్మెల్సీ అంజిరెడ్డి
ప్రభుత్వ భూమిని కాపాడండి
పటాన్చెరు టౌన్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నం బీసీలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదని, ప్రతిపాదిత బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లిం కోటా ఉన్నందున వారికి 32 శాతం రిజర్వేషన్లు మాత్రమే లభిస్తాయని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్లోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో విలేకరులతో మాట్లాడారు. మహా సంపర్క్ అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ కార్యకర్తలు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలు చేసే చాలా పథకాలు కేంద్రం నిధులతోనే అమలు చేస్తున్నారని తెలిపారు. గత 11 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం, దాని అనుబంధం రంగాల కోసం ఏకంగా రూ. 71 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. అన్నివర్గాల సంక్షేమం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేక, జనహిత పాదయాత్ర అని కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్లను నమ్మే స్థితిలో లేరన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకే పట్టం కడతారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ 765డీ జాతీయ రహదారిపై వెల్మకన్న గ్రామస్తులు ఆదివారం రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నంబర్ 447లో ప్రభుత్వ భూమిని కౌడిపల్లికి చెందిన వ్యక్తి అసైన్డ్ ల్యాండ్ పేరిట కబ్జా చేస్తున్నాడని ఆరోపించారు. ఈవిషయమై మండల, డివిజన్, జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు హైదరాబాద్ సీసీఎల్లో సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల అండతో కబ్జాకు పాల్పడుతున్నాడని వాపోయారు. రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ రంజిత్రెడ్డి గ్రామస్తులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం గ్రామస్తులు ఎస్ఐకి ఫిర్యాదు చేశారు.

బీసీలకు కాంగ్రెస్ అన్యాయం