
‘ఫుట్బాల్’ సంగ్రామం
ముస్తాబైన నవోదయం
● నేటి నుంచి మూడు రోజులపాటు పోటీలు ● జాతీయస్థాయి మెగాటోర్నీకి వర్గల్ సర్వ సన్నద్ధం ● సత్తాచాటనున్న వివిధ రాష్ట్రాల నవోదయ క్రీడాకారులు
వర్గల్(గజ్వేల్): పరుగులో చిరుత వేగం.. ప్రత్యర్థి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ బంతిని కాళ్ల మధ్య గింగిర్లు తీయిస్తూ.. గోల్ పోస్టు వైపు దూసుకెళ్తూ.. పెనాల్టీ కార్నర్లు.. పెనాల్టీ షూటవుట్లు.. అరుప లు, కేరింతలతో క్రీడాకారులు మూడురోజులపాటు క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నారు. ఇందుకు వర్గల్ నవోదయ వేదికకానుంది. జాతీయ ఫుట్బాల్ సంగ్రామానికి వర్గల్ నవోదయ సర్వసన్నద్ధమైంది. అత్యుత్తమ విద్యతోపాటు క్రీడలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్న స్థానిక నవోదయ వేదికగా సోమవారం నుంచి 3 రోజుల పాటు జరిగే టోర్నమెంట్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో..
దేశంలోని అన్ని నవోదయ విద్యాలయాల ఫుట్ బాల్ జట్ల క్రీడాకారులు ఆయా ప్రాంత రీజియన్కు ప్రాతినిధ్యం వహిస్తారు. 8 రీజియన్ల నుంచి అండర్–15 విభాగంలో ఒక జట్టు, అండర్–17 విభాగంలో మరో జట్టుగా మొత్తం 16 జట్లు టోర్నీలో తలపడనున్నాయి. గ్రూప్–ఏ, గ్రూప్–బీ గా జట్లను విభజించి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. టోర్నీలో విజేత జట్లు నవోదయ విద్యాలయాలన్నిటికి (నవోదయ ఒక రాష్ట్రంగా) ప్రాతినిధ్యంగా ‘ప్రీ–సుబ్రతో’ జాతీయ టోర్నీకి ఎంపికవుతారు. టోర్నీ కోసం వివిధ ప్రాంతాల నుంచి మొ త్తం 253 మంది క్రీడాకారులు, 32 మంది ఎస్కార్ట్ టీచర్లు వర్గల్కు చేరుకున్నారు.
సందడిగా రిహార్సల్స్
క్రీడాకారులు, ఎస్కార్ట్ టీచర్లతో వర్గల్ నవోదయ సందడిగా మారింది. స్టేడియంలో మార్చ్ఫాస్ట్, ఓ త్ టేకింగ్, తదితర రిహార్సల్స్ కొనసాగాయి. ప్రిన్సిపాల్ రాజేందర్ పర్యవేక్షణలో నవోదయ యంత్రాంగం తగు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

‘ఫుట్బాల్’ సంగ్రామం