
బడికి డుమ్మా కుదరిదిక
ఇక టీచర్లకూ ముఖ గుర్తింపు హాజరు
●ప్రధానోపాధ్యాయుడి వద్ద మొబైల్ యాప్
●ప్రభుత్వ పచ్చజెండాకు ఎదురుచూపులు ●జిల్లాలో 3,551 టీచర్లు
సర్కారు బడులను గాడిలో పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్త్రాన్ని సంధిస్తోంది. ఇప్పటివరకు విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ విధానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం టీచర్లకు ఆ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతుంది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న పెద్దపల్లి జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలోనే జిల్లాలో సైతం టీచర్ల ముఖ గుర్తింపు అటెండెన్స్ సిస్టం ప్రారంభం కాబోతుంది. – పాపన్నపేట(మెదక్)
జిల్లాలో 118 గెజిటెడ్ హెచ్ఎంలు, 89 మంది ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, 1,700 మంది ఎస్జీటీలు, 1,595 స్కూల్ అసిస్టెంట్లు, 37 లాంగ్వేజ్ పండిత్లు, 10 మంది పీఈటీలు, ఇద్దరు ఒకేషనల్ టీచర్లు కలిసి మొత్తం 3,551 మంది పని చేస్తున్నారు. సుమారు 83 వేల మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్నారు. గతేడాది 90 శాతం హాజరు లక్ష్యంగా విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ విధానం అమల్లోకి తెచ్చింది. ఇది సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఏఐతో ఎఫ్ఆర్ఎస్
కృత్రిమ మేధ సాంకేతికతతో పని చేసే ఈ యాప్ను 2023లో రూపొందించారు. టీచర్ల వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ఓపెన్ చేసి విద్యార్థుల ముఖం వైపు చూపడం ద్వారా హాజరు నమోదు అవుతుంది. ఒకేసారి 15 నుంచి 20 మంది హాజరు తీసుకోవచ్చు. వాస్తవ విద్యార్థుల సంఖ్యతో మధ్యాహ్న భోజన వినియోగాన్ని ఖచ్చితంగా చూపడంతో పాటు, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచవచ్చు. ఉన్నతాధికారులకు కూడా విద్యార్థుల హాజరు శాతం తెలిసిపోతుంది. అలాగే టీచర్లకు కూడా సత్ఫలితాలు వస్తాయన్న భావనతో అధికారులు ఈ విధానం అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
పైలట్ జిల్లాలో సత్ఫలితాలు
ప్రధానోపాధ్యాయుడి మొబైల్లో ఫేషియల్ రికగ్ని షన్ యాప్ను ఉంచుతారు. టీచర్ పాఠశాల ఆవరణలో ఉండి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని జిల్లా విద్యాశాఖాధికారితో పాటు పాఠశాల విద్య డైరెక్టరేట్కు అనుసంధానం చేస్తా రు. సాంకేతికత ఆధారపడిన ఈ విధానం ద్వా రా, టీచర్ ఎన్ని గంటలకు పాఠశాలకు వచ్చాడు, ఎప్పుడు వెళ్లాడు అనే అంఽశాన్ని పరిశీలించవచ్చు. పెద్దపల్లి జిల్లాలో ఈ విధానం ప్రవేశపెట్టడం ద్వారా టీచర్ల హాజరుశాతం, సమయపాలనలో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
సమయపాలన మెరుగు
ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ విధానం ప్రవేశపెట్టడాన్ని ఆహ్వానిస్తున్నాం. దీంతో సమయపాలన మెరుగవుతుంది. టీచర్లలో జవాబుదారి తనం పెరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మార్పులు వచ్చాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రకటించిన న్యాస్ ఫలితాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
– పంతుల రాజు,
ఉపాధ్యాయ సంఘం నాయకుడు

బడికి డుమ్మా కుదరిదిక