కేంద్రం నుంచి నేరుగా నిధులు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నేరుగా మంచిర్యాలకు నిధులు తీసుకొస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా శనివారం మంచిర్యాల నగరంలోని లక్ష్మీనారాయణ మందిరం, ముఖరం చౌరస్తా, అర్చనటెక్స్ చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ రోడ్డు గుండా ఐబీ చౌరస్తా వరకు రోడ్డుషో నిర్వహించారు. ఐబీ చౌరస్తాలోని బహిరంగ సభలో ఆయన ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మంచిర్యాల మేయర్గా బీజేపీ నుంచి గాజుల ముఖేశ్గౌడ్ను ఎంపిక చేశామని, ఈ ఎన్నికల్లో కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగురవేయాలని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ కేంద్ర నిధులతో విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు, ప్రాజెక్టులు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, మోదీ చేపట్టిన స్మార్ట్ సిటీలో మంచిర్యాలకు చోటు కల్పించి నేరుగా నిధులు తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, గాజుల ముఖేష్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
మంచిర్యాలతో అనుబంధం ఉంది..
మంచిర్యాలకు రావడం తొలిసారి కాదని, కాలేజీ రోజుల్లో తరచూ వచ్చేవాడినని, కాలేజీ స్నేహితులతో ఎంతో ఉల్లాసంగా గడిపానని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గుర్తు చేసుకున్నారు. కాలేజీలో తన స్నేహితులు మంచిర్యాలకు చెందిన వారు ఉండడంతో ఈ ప్రాంతానికి అప్పుడప్పుడు వస్తుండేవా డినని, ఈ ప్రాంతంలో సినిమాలు చూసేవాడినని, మంచిర్యాలతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. గోలి రాము నాగ్పూర్లో లా చదువుతున్నప్పుడు క్లాస్మేట్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులను మంచిర్యాలలో కలిశారు.
కేంద్రం నుంచి నేరుగా నిధులు


