నేటి నుంచి యాప్ ద్వారానే యూరియా
మంచిర్యాలఅగ్రికల్చర్: యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకే నేడు ఆదివారం నుంచి యూరియా బస్తాలు అందిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు. పంట సాగు కోసం యూరియా బస్తాలు కావాల్సిన రైతులు ముందుగానే బుకింగ్ యాప్లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. రైతు పేరు, ఎంపిక చేసుకున్న డీలరు, షాపు, బుకింగ్ ఐడీ, పట్టా పాస్బుక్, ఆధార్కార్డ్ జిరాక్సు కాపీలు అందించి 24 గంటల్లోపు తీసుకోవాలని తెలిపారు. డీలర్లు కూడా యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికే యూరియా బస్తాలు అందించాలని, నేరుగా విక్రయాలు చేయవద్దని హెచ్చరించారు.
స్ట్రాంగ్రూమ్ వద్ద పటిష్ట భద్రత
బెల్లంపల్లి/రామకృష్ణాపూర్: బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత కల్పించాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదేశించారు. శనివారం బెల్లంపల్లి బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదులు, రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఆర్కేసీఓఏ క్లబ్లో కౌంటింగ్ కేంద్రం పరిశీలించారు. బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్, మున్సిపల్ కమిషనర్ జె.సంపత్, తహసీల్దార్ కృష్ణ, వన్టౌన్ ఎస్హెచ్ఓ కే.శ్రీనివాసరావు, మందమర్రి సీఐ రమేష్, ఎస్సైలు పాల్గొన్నారు.
‘బీసీల ద్రోహిని సస్పెండ్ చేయాలి’
పాతమంచిర్యాల: బీసీల ద్రోహి మాధవరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జీవో విడుదల చేస్తే అగ్రకులానికి చెందిన మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో జీవోను కొట్టి వేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీంసేన్, చంద్రమౌళి, వేముల అశోక్, సతీష్, సుధాకర్, నాగేందర్ పాల్గొన్నారు.


