ఐదేళ్లు సర్పంచులకు పరీక్ష
● జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ ● సర్పంచుల శిక్షణ ప్రారంభం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నూతనంగా ఎన్నికై న సర్పంచులకు ఈ ఐదేళ్లు ఒక పరీక్షలాంటిదేనని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇంటికి వెళ్లక తప్పదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. సోమవారం హాజీపూర్ మండలం ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి విడత సర్పంచుల శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు, బడ్జెట్ తయారీ, ఖాతాల నిర్వహణ, పాలన విధానాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ గణపతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, హాజీపూర్ ఎంపీడీఓ సాయివెంకట్రెడ్డి, డీఎల్పీఓ సతీశ్, ఎంపీఓలు శ్రీపతి బాపు, అనీల్, శ్రీనివాస్, వెంకటేశ్, మహేశ్, పంచాయతీ కార్యదర్శులు, డీపీఎం నరేందర్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. చెన్నూర్, జైపూర్, హాజీపూర్, లక్సెట్టిపేట, భీమారం, మందమర్రి మండలాల నుంచి 101 మంది సర్పంచ్లు శిక్షణకు హాజరయ్యారు. పంచాయతీ రాజ్ నూతన చట్టం, పంచాయతీ సమగ్రాభివృద్ధి కరదీపికలతో కూడిన కిట్ బ్యాగులను అందజేశారు.


