నెన్నెలలో పోలీసుల కవాతు
నెన్నెల: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా మైలారం, నెన్నెల గ్రామాల్లో శుక్రవారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ధైర్యం, భరోసా కల్పించడానికే పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, నెన్నెల, తాళ్లగురిజాల ఎస్సైలు ప్రసాద్, రామకృష్ణ, ఆలీ, పోలీసులు పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
మందమర్రిరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని రౌడీషీటర్లను సీఐ శశిధర్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లను స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలు, ప్రజలను బెదిరింపులపై ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై ఆంజనేయులు, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ పాల్గొన్నారు.


