● తొలి విడతకు నాలుగు రోజులే గడువు ● వేగం పెంచుతున్న సర్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసి అభ్యర్థులు తేలడంతో పోటాపోటీగా ఓట్ల వేట మొదలైంది. మొదటి విడత ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. ఓటింగ్కు 48గంటల ముందే ప్రచారం నిలిపి వేయాల్సి ఉంటుంది. ఇక బహిరంగ ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉంది. సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి తమకు ఓటెయ్యాలని కోరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల తరఫున జిల్లా నాయకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే పల్లెల్లో మైకులు, రికార్డింగ్ ఆడియోలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం చేయిస్తున్నారు. గెలుపు కోసం వాడవాడల్లో ప్రతీ గడపకు తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మహిళలు, యువత ఓట్లు అధికంగా ఉన్న చోట్ల వారిపై ప్రత్యేక దృష్టి సారించి మద్దతు కోరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్, వార్డు స్థానాల్లో మద్దతుదారులతో కలిసి అందుబాటులో బూత్ల వారీగా ఉన్న ఓటర్లను కలుస్తున్నారు.
వలస ఓటర్లకు ఫోన్లు
గ్రామాల నుంచి పలు నగరాలు, పట్టణాలకు వలస వెళ్లిన వారిలో అనేకమంది ఓటర్లు ఉన్నారు. ఊళ్లో ఓటు ఉండి విద్య, ఉపాధి, ఉద్యోగరీత్యా హైదరాబాద్తోపాటు పొరుగు జిల్లాలకు వలస వెళ్లారు. ఆ ఓటర్లకు అభ్యర్థులు ఫోన్లు చేస్తూ బరిలో ఉన్నామని చెబుతూ మద్దతు కోరుతున్నారు. పోలింగ్ రోజు ఓటేసేందుకు గ్రామానికి రావాలని ముందుగానే ఓ మాట చెప్పి ఉంచుతున్నారు.
సోషల్ మీడియాలో జోరు
పంచాయతీ ఎన్నికల ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం తదితర సామాజిక మాధ్యమాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తును వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేసి విస్తృతంగా పాటలు, వీడియోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా పల్లెల్లో ఎన్నికలతో వాట్సాప్ గ్రూపులు నిండిపోతున్నాయి. తమ స్టేటస్లోనూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
రెండు, మూడో విడతలోనూ..
జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో రెండు, మూడో విడత నామినేషన్ల ప్రక్రియ సాగుతోంది. రెండో విడతలో శనివారం వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. విత్డ్రా తర్వాత రెండో విడతలో ఎన్నికలు జరగనున్న 114జీపీలు, 996వార్డు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలనుంది. ఆ తర్వాత అభ్యర్థులకు గుర్తులు కేటాయించాక ప్రచారం మరింత పెంచే అవకాశం ఉంది. ఇక మూడో విడతలో ఎన్నికలు జరిగే 102 పంచాయతీలు, 868వార్డు స్థానాలకు ఈ నెల 9వరకు నామినేషన్ల విత్ డ్రా సమయం ఉంది. తుదిగా బరిలో నిలిచిన అభ్యర్థులు తెలిస్తే ప్రచారం ముమ్మరం చేసే అవకాశం ఉంది.
● తొలి విడతకు నాలుగు రోజులే గడువు ● వేగం పెంచుతున్న సర్


