● చిచ్చుపెడుతున్న పంచాయతీ ఎన్నికలు ● ఏకగ్రీవాల కోసం ఒత్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో వర్గపోరును రాజేస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల మధ్య రాజకీయ వైరాన్ని మరింత పెంచేస్తున్నాయి. నామినేషన్లు వేసినప్పటి నుంచే పోటీదారుల మధ్య వైరం కొనసాగుతోంది. గ్రామ ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు బరిలో నిలబడినప్పటి నుంచే గ్రూపులుగా ఏర్పడుతున్నారు. పోటీ నుంచి తప్పుకునేలా చేస్తున్నారు. పలుచోట్ల నామినేషన్ల సమయంలోనే పలువురిని బలవంతంగా ఉపసంహరించుకరేలా ఒత్తిళ్లు తెచ్చారు. అధికార, ఆర్థిక, అంగబలంతో కొంతమందిని పోటీ నుంచి తప్పుకునేలా చేస్తున్నారు. జిల్లాలో పలు గ్రామాల్లో వార్డు, సర్పంచ్ స్థానాల్లో కొందరు పోటీ నుంచి తప్పుకోగా.. ఒకే అభ్యర్థి ఉన్నచోట్ల ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సర్పంచ్గా రిజర్వేషన్లు కలిసి రాని వారంతా ఉప సర్పంచ్ పీఠం ఆశిస్తున్నారు. జిల్లాలో మొదటి విడత 90 పంచాయతీలు, 816 వార్డు స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక అభ్యర్థులు తేలిపోయారు. ఇక రెండు, మూడో విడత పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడత పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. ఈ క్రమంలో వాడీవేడిగా రాజకీయాలు సాగుతున్నాయి.
గెలుపే లక్ష్యంగా రాజకీయాలు
బరిలో ఉన్న అభ్యర్థులు తమ గెలుపే లక్ష్యంగా రాజకీయాలు సాగిస్తున్నారు. ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్నిసార్లు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ హద్దులు దాటుతున్నారు. చట్టాన్ని అతిక్రమించి హద్దులు మీరుతూ వివాదాస్పదం అవుతున్నారు. తనను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నారంటూ బెల్లంపల్లి మండలం చాకపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మౌనిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దండేపల్లి మండలం పాత మామిడిపల్లి సర్పంచ్ అభ్యర్థి మాధవి నామినేషన్ ఉప సంహరణకు వచ్చే క్రమంలోనూ చివరి వరకు హైడ్రామా సాగింది. నిర్ణీత సమయం తర్వాత వచ్చి విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంకా చాలాచోట్ల బయటకు రాకుండా లోలోపల ఒప్పందాలు కుదుర్చుకుని పోటీలో ఉన్న కొందరు తప్పుకునేందుకు రాజీ పడుతున్నారు. రెండు, మూడో విడత నామినేషన్ల ఉపసంహరణలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. మొదట బరిలో ఉన్న వారికి వచ్చే పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు, మండల జిల్లా స్థాయిలో కో ఆప్షన్గా ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేస్తామని ఆశ చూపిస్తున్నారు. ఇక కొందరైతే డబ్బు ఆశతోపాటు పలు రకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇక చెబితే వినకుండా ఉన్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతు న్న ఘటనలూ ఉన్నాయి. దీంతో పల్లెల్లో పంచా యతీ ఎన్నికల్లో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.
అభ్యర్థులూ.. తస్మాత్ జాగ్రత్త
ఐదేళ్ల పంచాయతీ ఎన్నికల కోసం పచ్చని గ్రామాల్లో చిచ్చుపెట్టుకోవద్దని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గొప్పలకు పోయి డబ్బుల ఖర్చుతోపాటు వైరాలు పెంచుకోవద్దని హితవు పలుకుతున్నారు. గ్రామాల బాగు కోసం కలిసికట్టుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగి ఎన్నికలు నిర్వహించుకోవాలని కోరుతున్నారు. పలుకుబడి, డబ్బుల ఖర్చు, రాజకీయ వైరం, కక్షసాధింపు చర్యలతో నేరాలకు పాల్పడకుండా తస్మాత్ జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.
● చిచ్చుపెడుతున్న పంచాయతీ ఎన్నికలు ● ఏకగ్రీవాల కోసం ఒత్


