సీఎం సారూ.. మీపైనే ఆశలు | - | Sakshi
Sakshi News home page

సీఎం సారూ.. మీపైనే ఆశలు

Dec 4 2025 8:44 AM | Updated on Dec 4 2025 8:44 AM

సీఎం సారూ.. మీపైనే ఆశలు

సీఎం సారూ.. మీపైనే ఆశలు

● ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజల ఆరోగ్య వరప్రదాయనిగా ఉన్న జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. ప్రధానంగా క్యాన్సర్‌, గుండె సంబంధిత వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్పెషలిస్టు వైద్యులను పూర్తిస్థాయిలో నియమించి పేదలకు నాణ్యమై న వైద్యమందించాల్సిన అవసరముంది. ● ఆదివాసీల జిల్లాగా పిలువబడే ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయంలో మంజూరైన గిరిజన వర్సిటీని వరంగల్‌కు తరలించారు. అధికారంలోకి వస్తే ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో, ముఖ్యమంత్రి అయ్యాక ఇంద్రవెల్లి సభలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. ● ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ భూసేకరణకు జీవో జారీ చేయడంపై ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన నిధులు కూడా త్వరితగతిన విడుదల చాలని కోరుతున్నారు. ‘సాక్షి’ సైతం సామాజిక బాధ్యతగా వరుస కథనాల ద్వారా ఈ అంశాన్ని పాలకుల దృష్టికి తీసుకువెళ్లిన విషయం విదితమే.

ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన సమస్యలు

నేడు ఆదిలాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగసభ

కై లాస్‌నగర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బుధవారం ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. అక్కడి నుంచే పలు అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు అనేకం ఉన్నాయి. విద్య, వైద్య, మౌలిక వసతుల పరంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతులు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతవాసులు సీఎం కల్పించే భరోసాపై గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వస్తే ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన సీఎం ఆ దిశగా ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పర్యటన సాగుతుందిలా...

సీఎం మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 2గంటలకు ఆదిలాబాద్‌లోని ఎరోడ్రమ్‌కు చేరుకుంటారు. 2.10 గంటలకు కాన్వాయ్‌ ద్వారా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకుంటారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 3.45గంటలకు స్టేడియం నుంచి హెలిప్యాడ్‌కు చేరుకుని హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement