
● డిపోకే పరిమితమైన బస్సులు ● తెరుచుకోని దుకాణాలు ● నిర్
మంచిర్యాలఅర్బన్/చెన్నూర్/మందమర్రిరూరల్/పాతమంచిర్యాల: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనకు బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం జిల్లాలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించి మూసివేయించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎమ్మార్పీఎస్, బీఎస్పీ తదితర పార్టీల నాయకులు ర్యాలీలు నిర్వహించి అక్కడక్కడ తెరిచి ఉన్న దుకాణాలను మూసి వేయించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం ఆధ్వర్యంలో నగరంలో మోటార్సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మందమర్రిలో సింగరేణి బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తించారు. మంచిర్యాలలో రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, వామపక్ష పార్టీలు, బీసీ జేఏసీ, బీసీ సమాజ్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. బీసీ జేఏసీ నాయకులు వడ్డేపల్లి మనోహర్, నరెడ్ల శ్రీనివాస్, డాక్టర్ నీలకంఠేశ్వర్రావు, ముఖేష్గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, స్వర్ణకార సంఘం పట్టణ అధ్యక్షుడు ఎం.రమేష్, కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్, ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎదునూరి రమేష్, ఎంబీసీ నాయకులు వైద్య భాస్కర్, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల వంశీ, రాజేశ్, నితీష్, హరీష్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. టీఆర్పీ జిల్లా ఇన్చార్జి మహేశ్వర్మ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ను అడ్డుకుంటున్న కుట్రదారుల దిష్టిబొమ్మ దహనం చేశారు. రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో వామపక్ష పార్టీలు శవయాత్ర చేస్తుండగా పోలీసులు లాక్కోవడంతో వాగ్వాదం జరిగింది. అనంతరం బస్టాండ్ నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
కదలని బస్సులు
మంచిర్యాలలో బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. డిపోలో 147 బస్సులు రోజుకు 62వేల కిలోమీటర్లు తిప్పడం ద్వారా రూ.34లక్షల నుంచి రూ.36లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. తెల్లవారు జాము 3.45గంటల నుంచి ఒక్క బస్సు కూడా డిపో నుంచి కదల్లేదు. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఆదివారం సెలవు, సోమవారం దీపావళి పండుగ కావడంతో హైదరాబాద్లో చదువు, ఉద్యోగ నిమిత్తం ఉన్నవారంతా శుక్రవారమే సొంతూళ్లకు చేరుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు యధావిధిగా విధులకు హాజరై రిపోర్టు చేశారు. బంద్కు సంఘీభావం ప్రకటించారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత బస్సులు రాకపోకలు సాగించాయి.
రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలు
రిజర్వేషన్ల అమలు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర కార్మిక, గనులు, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. శనివారం ఆయన మందమర్రిలో నిర్వహించిన ర్యాలీలో, చెన్నూర్ పట్టణంలో పర్యటించారు. బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన బంద్లో పాల్గొన్నారు. కొన్ని వ్యాపార సంస్థలు తీసి ఉండగా.. బంద్ పాటించి బీసీలకు మద్దతు ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్లు అమలైతే కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీకి పేరొస్తుందని బీజేపీ రిజర్వేషన్లకు సహకరించడం లేదని విమర్శించారు.
– మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి

● డిపోకే పరిమితమైన బస్సులు ● తెరుచుకోని దుకాణాలు ● నిర్

● డిపోకే పరిమితమైన బస్సులు ● తెరుచుకోని దుకాణాలు ● నిర్