
‘పాలఘోరీ’పై ప్రత్యేక నిఘా
జన్నారం: అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పాలఘోరీ ఘటన మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండేందుకు ఆశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రెండేళ్ల క్రితం కూడా ఇలాంటి సమస్య ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏ క్షణంలోనైనా ఆదివాసీ గిరిజనులు గుడిసెలు వేసుకునే అవకాశం ఉండడంతో అట వీశాఖ అధికారులు అదే ప్రాంతంలో తిష్ట వేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు.
గుడిసెలు తొలగింపు
జన్నారం అటవీ డివిజన్, ఇందన్పల్లి రేంజ్ కవ్వాల్ అటవీ సెక్షన్, సోనాపూర్ తండా బీట్ పాలఘోరీ ప్రాంతంలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, జైనూర్, లింగాపూర్ మండలాలకు చెందిన సుమారు వందమంది ఆదివాసీ గిరిజనులు ఆగస్టు 4న ఈ ప్రాంతంలో తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. అట వీ, పోలీసు, రెవెన్యూ అధికారులు వారికి పలుమా ర్లు కౌన్సిలింగ్ ఇచ్చి ఆప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించారు. కానీ వారు వెళ్లకపోగా సెప్టెంబర్ 18న రాత్రి సుమారు 350 టేకుచెట్లను నరికారు. అడ్డుగా వెళ్లిన అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడ్డారు. దీంతో 26 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల సహాయంతో అడవిలో వేసుకున్న గుడిసెలను తొలగించారు.
కందకాల తవ్వకం
పాలఘోరీ ప్రాంతంలో విలువైన టేకు చెట్లు నరికివేతకు గురి కావడాన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు ఆ ప్రాంత పరిసరాల్లో చుట్టూ కందకాలను తవ్వించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలను సిబ్బందికి అప్పగించారు. అయితే టైగర్జోన్ సర్కిల్, జిల్లా అటవీశాఖ, జన్నారం డివిజన్ శాఖ నుంచి పాలఘోరీపై నిఘా ఉన్నట్లు తెలుస్తుంది.